హామీలు నెరవేర్చకుండా వీఆర్‌ఏలపై లాఠీచార్జి చేస్తారా?: ప్రవీణ్‌కుమార్‌

ABN , First Publish Date - 2022-10-03T09:45:54+05:30 IST

శాంతియుతంగా సమ్మె చేస్తున్న వీఆర్‌ఏలపై సీఎం కేసీఆర్‌ లాఠీచార్జ్‌ చేయించి అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ

హామీలు నెరవేర్చకుండా వీఆర్‌ఏలపై లాఠీచార్జి చేస్తారా?: ప్రవీణ్‌కుమార్‌

మర్రిగూడ, అక్టోబరు 2: శాంతియుతంగా సమ్మె చేస్తున్న వీఆర్‌ఏలపై సీఎం కేసీఆర్‌ లాఠీచార్జ్‌ చేయించి అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం బట్లపల్లిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 70 రోజులుగా రాష్ట్రంలోని 23వేల మంది వీఆర్‌ఏలు శాంతియుతంగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా అవమానపరుస్తూ దొరల అహంకారాన్ని ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు. వరంగల్‌లో ఆస్పత్రి ప్రారంభించడానికి వెళ్లిన సీఎం కేసీఆర్‌ నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో రూ.4.50 కోట్లతో నిర్మించి మూడేళ్లు గడిచినా 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. బీసీల కులగణన చేయకుండా మోసం చేసిన బీజేపీలో చేరిన రాజగోపాల్‌రెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా బహుజనులు గ్రహించి మోసకారి సీఎం కేసీఆర్‌ను గద్దె దించేందుకు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-10-03T09:45:54+05:30 IST