లంచం ఓ పద్ధతిగా తీసుకోండి.. అధికారులకు ఎమ్మెల్యే హితబోధ

ABN , First Publish Date - 2021-09-29T07:07:45+05:30 IST

పైసా లంచం కూడా చట్టవిరుద్ధమే.. అయితే, మధ్యప్రదేశ్‌లోని ఎమ్మెల్యే

లంచం ఓ పద్ధతిగా తీసుకోండి.. అధికారులకు ఎమ్మెల్యే హితబోధ

లంచం తీసుకోండి! ఓ పద్ధతిగా..!



భోపాల్‌, సెప్టెంబరు 28: పైసా లంచం కూడా చట్టవిరుద్ధమే.. అయితే, మధ్యప్రదేశ్‌లోని ఎమ్మెల్యే రాంబాయ్‌ సింగ్‌(బీఎస్పీ) స్వచ్ఛందంగా ఇచ్చే లంచాలను ఉద్యోగు లు తీసుకొంటే తప్పేమీ కాదన్నట్లుగా సెలవిచ్చారు. పైగా ఇచ్చేవారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని లంచం ఆశించాలని సూచన కూడా చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తన నియోజకవర్గం పతారియా పరిధిలోని సాతువా గ్రామంలో ఓ చోట ప్రజలతో ఆమె సమావేశమయ్యారు.


ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద తమకు ఇళ్లు మంజూరు చేయడానికి పంచాయతీ సిబ్బంది లంచం తీసుకొన్నారని గ్రామస్థులు ఆరోపించారు. ఎంత ఇచ్చారు? ఎవరు తీసుకొన్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. పైకిలేచి నిలబడిన ఆరుగురు తమ వేళ్లను ఇద్దరు పంచాయతీ అధికారులవైపు చూపిస్తూ.. రూ.5-9 వేలు ఇచ్చామని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే తన బోధ మొదలుపెట్టారు.


‘‘లంచం తీసుకోండి. కానీ, ఓ పద్ధతి ఉండాలిగా. పిండిలో ఉప్పు మాదిరిగా లంచం తీసుకోవాలి. ఇష్టానుసారం వసూలు చేయకూడదు. పైగా గ్రామస్థుల నుంచి తీసుకున్న మొత్తంలోనూ వ్యత్యాసమే. ఇలా కుదరదు. అందరూ చిన్నాచితకా పనులు చేసుకొనేవాళ్లే.. మీరు ఓ ఐదువందలో వెయ్యో ఉంచుకొని.. మిగతాది తిరిగిచ్చేయండి’’ అని అధికారులను ఆదేశించారు. ఇది ఉభయకుశలోపరిగా ఉందంటూ అటు అధికారులు.. ఇటు గ్రామస్థులూ సంబురపడ్డారు. అయితే.. చట్టాన్ని అతిక్రమిస్తున్నామన్న మాట వాళ్లతోపాటు ఎమ్మెల్యే కూడా మరిచారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదూ అందలేదని కలెక్టర్‌ చెప్పారు. 



Updated Date - 2021-09-29T07:07:45+05:30 IST