ప్రాణాలు తీసిన ఫొటోషూట్‌

ABN , First Publish Date - 2020-06-01T15:00:28+05:30 IST

ఫొటోల సరదా ఇద్దరు అన్నదమ్ముల ప్రాణం తీసింది. సోషల్‌ మీడియాలో..

ప్రాణాలు తీసిన ఫొటోషూట్‌

చెరువులో పడి అన్నదమ్ములు మృతి


గుడివాడ(రాజేంద్రనగర్‌)/కృష్ణా: ఫొటోల సరదా ఇద్దరు అన్నదమ్ముల ప్రాణం తీసింది. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడానికి ఫొటోషూట్‌కు సిద్ధమైన అన్నదమ్ములు గుడివాడ రక్షిత మంచినీటి చెరువులో పడి దుర్మరణం పాలయ్యారు. వివరాల ప్రకారం.. పట్టణంలోని మందపాడుకు చెందిన వైసీపీ నేత కొలుసు నరేంద్రకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు హర్షవర్థన్‌ (21) గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మెకానికల్‌ ఫైనల్‌ ఇయర్‌ పూర్తిచేశాడు. రెండో కుమారుడు ప్రేమ్‌చంద్‌ (19) గుడ్లవల్లేరు పాలిటెక్నిక్‌ కళాశాలలో పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరం పూర్తిచేశాడు.


వీరిద్దరూ మరో 9మందితో కలిసి ఆదివారం ఉదయం పెద ఎరుకపాడులో ఉన్న మున్సిపల్‌ రిజర్వాయర్‌ (చెరువు) వద్ద ఫొటోషూట్‌కు వెళ్లారు. సరదాగా సోషల్‌ మీడియాలో ఫొటోలు షేర్‌ చేద్దామనుకున్న హర్షవర్థన్‌ చెరువు గట్టు పైనుంచి సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు జారి చెరువులో పడ్డాడు. దీంతో స్నేహితులు కాపాడే ప్రయత్నం చేస్తుండగా, అతని తమ్ముడు ప్రేమ్‌చంద్‌ అన్నకు ఈత రాదని కాపాడేందుకు యత్నించి కాలుజారి చెరువులో పడ్డాడు. చెరువు చాలా లోతు ఉండటంతో వారు బయటకు రాలేక, గట్టుపై ఉన్నవారికి చెరువులో దిగే ధైర్యంలేక హర్షవర్థన్‌, ప్రేమ్‌చంద్‌ ఇద్దరూ మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. ఈ మేరకు టూటౌన్‌ ఎస్‌ఐ వి.శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


మందపాడులో విషాదఛాయలు

అన్నదమ్ములు మృతి చెందడంతో మందపాడులో విషాదఛాయలు అలముకున్నాయి. చేతికి అందివచ్చిన కుమారుల మృతితో నరేంద్ర దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండడం అందరినీ కలిచివేసింది. హర్షవర్థన్‌, ప్రేమ్‌చంద్‌ స్నేహితులు అధికసంఖ్యలో గుడివాడ ఏరియా ఆసుపత్రికి చేరుకుని కంటతడి పెట్టారు.

Updated Date - 2020-06-01T15:00:28+05:30 IST