చిలుక కోసం యువకుడి ప్రాణం బలి.. దారుణంగా చంపేసి ఎవరికీ దొరక్కుండా స్కెచ్.. చివరకు..

ABN , First Publish Date - 2022-04-15T22:20:19+05:30 IST

చిన్న చిన్న విషయాలకే అతిగా స్పందిస్తున్న కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు.

చిలుక కోసం యువకుడి ప్రాణం బలి.. దారుణంగా చంపేసి ఎవరికీ దొరక్కుండా స్కెచ్.. చివరకు..

చిన్న చిన్న విషయాలకే అతిగా స్పందిస్తున్న కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో తోటి మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. చిలుకను దొంగిలించాడనే కారణంతో ఓ యువకుడిని అతి కిరాతకంగా చంపేసిన ఘటన తాజాగా మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. పోలీసులకు దొరక్కూడదనే కారణంతో మృతదేహాన్ని మాయం చేశారు. చివరకు పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలయ్యారు. 


మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లా రాణిపురా గ్రామానికి చెందిన అమిత్ అనే యువకుడు ఈ నెల 6వ తేదీన అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు ఎంతగా వెతికినా అమిత్ కనిపించలేదు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అమిత్ కోసం అన్వేషణ ప్రారంభించారు. ఆ సమయంలో గ్రామ శివారులో అమిత్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం హత్య ఎవరు చేసి ఉంటారని దర్యాఫ్తు ప్రారంభించారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు కీలక సమాచారం అందించాడు. 


అదే గ్రామానికి చెందిన అజయ్, అనిల్‌పై అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. తామే అమిత్‌ను చంపినట్టు వారు అంగీకరించారు. తాము ఇంటి వద్ద ఓ చిలుకను పెంచుకుంటున్నామని, దానిని అమిత్ దొంగిలించాడని వారు పోలీసులకు తెలిపారు. ఈ విషయమై వారిద్దరూ అమిత్‌‌తో గొడవపెట్టుకున్నారు. ఆ గొడవలో ఒక పెద్ద రాయి తీసుకొని అమిత్‌ తలపై కొట్టడడంతో తీవ్ర గాయమైంది. తీవ్ర రక్తస్రావం జరగడంతో అమిత్ అక్కడికక్కడే మరణించాడు. ఎవరికి దొరకకుండా ఉండేదుకు అమిత్ మృతదేహానికి రాయిని కట్టి నదిలో విసిరేశారు. 

Updated Date - 2022-04-15T22:20:19+05:30 IST