రాముడి కోసం 151 నదుల నుంచి జలాలు సేకరించిన సోదరులు

ABN , First Publish Date - 2020-08-02T22:17:11+05:30 IST

భవ్య రామాలయ నిర్మాణం కోసం ఈనెల 5న భూమిపూజ జరుగనుండటంతో రామభక్తులు అయోధ్య బాట..

రాముడి కోసం 151 నదుల నుంచి జలాలు సేకరించిన సోదరులు

అయోధ్య: భవ్య రామాలయ నిర్మాణం కోసం ఈనెల 5న భూమిపూజ జరుగనుండటంతో రామభక్తులు అయోధ్య బాట పడుతున్నారు. రామభక్తులైన ఇద్దరు సోదరులు 151 నదుల నుంచి జలాలను, శ్రీలంక నుంచి సేకరించిన మట్టిని అయోధ్యకు తీసుకు వెళ్తూ తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటున్నారు.


సోదరులైన రాథే శ్యాం పాండే, శబ్ధ్ వైజ్ఞానిక్ మహాకవి త్రిపాల 70 ఏళ్లు పైబడిన వారు. 1968 నుంచి 8 నదులు, 3 సముద్రాల నుంచి జలాలు సేకరించారు. శ్రీలంకలోని 16 ప్రాంతాల నుంచి మట్టి కూడా సేకరించారు. దీనిపై రాథే శ్యాం పాండే మీడియాతో మాట్లాడుతూ, రామాలయం ఎప్పుడు కడితే అప్పుడు తమ సేకరణలను రాముడికి సమర్పించాలనేది తమ చిరకాల వాంఛని చెప్పారు.


'దేశంలోని నదులు, శ్రీలంక నుంచి మట్టి సేకరించాలని మా సోదరులు అనుకున్నాం. రాముడి ఆశీస్సులతో మా లక్ష్యం నెరవేరింది. 151 నదులు, 8 పెద్ద నదులు, 3 సముద్రాల నుంచి నీటిని, శ్రీలంకలోని 16 ప్రాంతాల నుంచి మట్టి సేకరించాం' అని ఆయన చెప్పారు. 1968 నుంచి 2019 వరకూ కాలినడకన, సైకిలు, మోటారు సైకిలు, రైళ్లు, విమానాలలో జర్నీ చేసి తాము ఈ సేకరణలు చేశామని తెలిపారు. వీటిని రామ్‌జీ (రాముడు) జన్మస్థలమైన అయోధ్యకు సమర్పిస్తామని వివరించారు.


ఈనెల 5న ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో భూమిపూజ చేసిన అనంతరం ఆలయ నిర్మాణ కార్యక్రమాలు మొదలవుతాయి. మూడున్నరేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని ఆలయ స్తపతి చెబుతున్నారు.

Updated Date - 2020-08-02T22:17:11+05:30 IST