దళారీ దందా
ABN , First Publish Date - 2021-10-28T05:09:54+05:30 IST
మొక్కజొన్న కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనబరుస్తున్న తాత్సార ధోరణి అన్నదాతలను ఆర్థిక నష్టాలకు గురి చేస్తోంది.
- మార్క్ఫెడ్ కొనుగోళ్లు లేక మొక్కజొన్న రైతులు కుదేలు
- జిల్లాలో విజృంభిస్తున్న దళారులు
- మద్దతు ధర కంటే తక్కువ చెల్లిస్తూ అన్నదాతలను నిండా ముంచుతున్న వైనం
నాగర్కర్నూల్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): మొక్కజొన్న కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనబరుస్తున్న తాత్సార ధోరణి అన్నదాతలను ఆర్థిక నష్టాలకు గురి చేస్తోంది. గడిచిన రెండేళ్లుగా మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి నిర్దిష్టమైన కార్యాచరణను సకాలంలో అమలు చేయకపోవడం కారణంగా రైతాంగానికి నష్టం వాటిల్లుతుండగా దళారులకు కాసుల వర్షం కురుస్తోంది. మార్క్ఫెడ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం మొక్కజొన్న కొనుగోలు చేయడానికి ఎలాంటి కార్యాచరణను రూపొందిం చకపోవడం జిల్లాలో దళారులకు వరంగా మారింది. వానాకాలంలో ప్రధానంగా పత్తి, మొక్కజొన్న సాగు చేసే రైతాంగానికి రెండేళ్ల నుంచి జిల్లా వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సన్నరకం వడ్లు, మినుములు, పత్తి పంట సాగు చేసే విధంగా పురమాయించింది. లోటు, అధిక వర్షాలు మార్కెట్లో సరైన ధరలు అందించకపోవడం కారణంగా పత్తి, వరి వేసిన రైతులు నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. ఈ వానాకాలం సీజన్లో మాత్రం సన్నరకం వడ్లు, పత్తి గురించి విస్తృతంగా ప్రచారం చేసి మొక్కజొన్న గురించి ఏమాత్రం ప్రస్తావించకపోవ డంతో జిల్లాలో నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల లో దాదాపు 50వేల ఎకరాలలో మొక్కజొన్నను సాగు చేశారు. మొక్కజొన్నకు కేం ద్ర ప్రభుత్వం ఎ-గ్రేడ్కు క్వింటాల్కు 1880 రూపాయలు, బి-గ్రేడ్కు 1850 ధర ని ర్ణయించగా మార్క్ఫెడ్ నుంచి కొనుగోలు చేసే విషయంలో స్పష్టత రాకపోవడం తో దళారులు ఏ, బి గ్రేడ్ క్వింటాల్కు 500 రూపాయల నుంచి 600వరకు ధరను దిగువకు చేర్చి మొక్కజొన్న రైతులను మోసం చేస్తున్నారు. మద్దతు ధర సంగతి దేవుడెరుగు తూకాల్లో కూడా మోసం చేస్తున్న అధికార యంత్రాంగం నోరుమెదపడం లేదు. గడిచిన రెండేళ్ల నుంచి మార్క్ఫెడ్ టెండర్లు పిలవకుండా నాన్చుడు ధోరణి అవలంభిస్తుండడం అన్నదాతలను ఆవేదనకు గురి చేస్తోంది.
ప్రభుత్వం కోనుగోలు చేయాలి
ప్రభుత్వం మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలి. కృష్ణానది సమీపంలో, పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నా ఇంకా వర్షాధార పంటలపై ఆధారపడి సాగు చేస్తున్నాం. వర్షాధార పంటగా సాగు చేసే మొక్కజొన్నను ప్రభుత్వం గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేయాలి.
- మీనిగ పరుశరామ నాయుడు, కుడికిళ్ల