ప్రసార ప్రతిభా తరంగిణి

ABN , First Publish Date - 2021-02-26T06:15:47+05:30 IST

ప్రసార రంగంలో ఆకాశవాణి, దూరదర్శన్ రెండు మాధ్యమాలపై పట్టున్న అధికారులు అరుదు. ఆ అరుదైన కోవకు చెందుతారు ఆకాశవాణి...

ప్రసార ప్రతిభా తరంగిణి

ప్రసార రంగంలో ఆకాశవాణి, దూరదర్శన్ రెండు మాధ్యమాలపై పట్టున్న అధికారులు అరుదు. ఆ అరుదైన కోవకు చెందుతారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం డిప్యూటీ డైరక్టర్ జనరల్ శైలజా సుమన్. ఆమె 38ఏళ్ళ పాటు ప్రసారరంగంలో విశిష్ఠ సేవలనందించారు. ఎనభయ్యో దశకంలో దూరదర్శన్ ప్రొడ్యూసర్‌గా వారం వారం ఆమె సమర్పించిన ‘సుమాంజలి’ కార్యక్రమం ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. అప్పట్లో అనేక సీరియల్స్‌కు రూపకల్పన చేసింది కూడా ఆమే. ‘స్వరసమరం’ కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఔత్సాహిక గాయనీగాయకులను ప్రోత్సహించారు.


ఆకాశవాణిలోనూ శైలజ కృషి తక్కువేమీ కాదు. సౌత్ ఆర్కైవ్స్ ద్వారా ఆకాశవాణికే స్వంతమయిన అపురూప భక్తిరంజని, నాటకాలు, శాస్త్రీయ సంగీతాన్ని సిడీలద్వారా జనబాహుళ్యంలోకి తెచ్చారు. హైదరాబాద్ తొలి ఎఫ్‌ఎమ్ అయిన ఎఫ్‌ఎమ్‌ రెయిన్‌బోను జనరంజకంగా తీర్చిదిద్దారు. మార్కెటింగ్ డివిజన్ డైరక్టర్‌గా ప్రసారభారతికి ఆదాయం సమకూర్చటమే కాదు, యూనిసెఫ్ సహకారంతో గర్ల్‌ఛైల్డ్‌పై లఘచిత్రాల పోటీలు నిర్వహించి సృజనకు పట్టం కట్టారు. దూరదర్శన్ హైదరాబాద్, విజయవాడ కేంద్రాలకు యాదగిరి, సప్తగిరి ఛానెళ్లుగా ప్రత్యేక గుర్తింపును తెచ్చారు. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఆకాశవాణి కేంద్రం డైరక్టర్‌గా వ్యవహరించారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర డిప్యూటీ డైరక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించిన తొలి తెలుగు మహిళ ఆమె. దేశవ్యాప్తంగా ప్రసారమయ్యే ప్రధాని మన్ కీ బాత్ రికార్డింగ్ బృంద సభ్యులుగా కీలకపాత్ర పోషించారు.


గత ఏడాదిన్నర కాలం నుంచి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తూ కార్యక్రమాలలో వైవిధ్యానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. గత సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామీణ రైతు మహిళలకు పరస్కారాలందించారు. కొవిడ్ కాలంలో ఆ వ్యాధిపై అవగాహనకు కృషి చేస్తూనే ‘శ్రవ్య సౌరభాలు’ శీర్షికన ఆర్కైవల్ నాటకాలను, ‘స్మరవారం’ శీర్షికన అలనాటి కార్యక్రమాల వెలుగులను ప్రసారం చేస్తూ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రజలకు చేరువ చేశారు. శైలజాసుమన్‌ మల్లాది రామకృష్ణ శాస్త్రి మనవరాలవడం, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ దగ్గరి బంధువుకావడం ఆమెలో ఇంతటి సాంస్కృతిక సారస్వత సేవకు స్ఫూర్తిని కలిగించాయేమో. ఈ నెల 28న ఆమె పదవీవిరమణ చేస్తున్నారు. ప్రతిభ ఎక్కడున్నా ప్రోత్సహించటం, మృదువుగా పనిని రాబట్టడం ఆమె నాయకత్వానికి మచ్చుతునకలు.

జి.విజయకుమార్, విశ్రాంత కార్యక్రమ అధికారి

Updated Date - 2021-02-26T06:15:47+05:30 IST