పెళ్లి రిసెప్షన్లో కుప్పకూలిన వధువు.. చనిపోతూ మరికొందరికి సహాయం..!
ABN , First Publish Date - 2022-02-13T20:51:45+05:30 IST
ఆమెకు పెళ్లి కుదిరింది.. పెళ్లి ముందు రోజు ఏర్పాటు చేసిన రిసెప్షన్లో ఉత్సాహంగా పాల్గొంది..
ఆమెకు పెళ్లి కుదిరింది.. పెళ్లి ముందు రోజు ఏర్పాటు చేసిన రిసెప్షన్లో ఉత్సాహంగా పాల్గొంది.. బంధుమిత్రులతో కలిసి సరదాగా గడిపింది.. అయితే వేడుక పూర్తి కాకముందే రిసెప్షన్ వేదిక మీదే ఆమె కుప్ప కూలిపోయింది.. వెంటనే బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.. ఆరు రోజుల చికిత్స అనంతరం ఆమె బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు చెప్పారు.. దీంతో పెళ్లింట్లో విషాదం అలముకుంది.. కర్ణాటకలోని శ్రీనివాసపురంలో ఈ ఘటన జరిగింది.
శ్రీనివాసపురంకు చెందిన చైత్ర (26) కైవార కళాశాలలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తోంది. ఆమెకు హొసకోటకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 6న వీరి వివాహం జరగాల్సి ఉంది. అంతకు ముందు రోజు రిసెప్షన్ జరుగుతున్న సమయంలో వేదిక మీదే చైత్ర కుప్పకూలిపోయింది. బంధుమిత్రులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆరు రోజులు చికిత్స అందించిన వైద్యులు చైత్ర బ్రెయిన్ డెడ్ అయిందని తేల్చారు.
దీంతో చైత్ర తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అంత విషాదంలోనూ వారు ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. చైత్ర అవయవాలను దానం చేసి మానవత్వం చాటుకున్నారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. అత్తవారింటికి వెళ్లాల్సిన కూతురు స్మశానికి వెళుతోందని తీవ్రంగా విలపించారు.