వరుడి కోసం గుర్రం మీద వెళ్లిన వధువు.. హోటల్ నుంచి బయటకు వచ్చిన వరుడు ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2021-12-15T19:28:26+05:30 IST

సాధారణంగా పెళ్లి వేడుకల్లో వరుడిని గుర్రం మీద ఊరేగిస్తుంటారు. ఇంటి నుంచి గుర్రం మీద వరుడు ఊరేగింపుగా కల్యాణ మండపానికి బయల్దేరతాడు.

వరుడి కోసం గుర్రం మీద వెళ్లిన వధువు.. హోటల్ నుంచి బయటకు వచ్చిన వరుడు ఏం చేశాడంటే..

సాధారణంగా పెళ్లి వేడుకల్లో వరుడిని గుర్రం మీద ఊరేగిస్తుంటారు. ఇంటి నుంచి గుర్రం మీద వరుడు ఊరేగింపుగా కల్యాణ మండపానికి బయల్దేరతాడు. వెనకాల కారులో వధువు అతడిని అనుసరిస్తుంటుంది. అయితే బీహార్‌లోని గయకు చెందిన ఓ వివాహంలో దీనికి భిన్నంగా జరిగింది. వధువు గుర్రం మీద ఊరేగింపుగా బయల్దేరింది. వరుడు ఆమెను కారులో అనుసరించాడు. ఈ దృశ్యం ఎంతో మందిని ఆకట్టుకుంది. 


గయ నగరానికి చెందిన అనుష్క అనే యువతి ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమెకు అదే నగరానికి చెందిన జీత్ ముఖర్జీ అనే వ్యక్తితో పెళ్లి కుదిరింది. బుధవారం తెల్లవారు ఝామున వీరి వివాహానికి ముహూర్తంగా నిర్ణయించారు. మంగళవారం సాయంత్రం అనుష్క తన నివాసం నుంచి గుర్రంపై ఊరేగింపుగా బయల్దేరింది. బంధువులతో కలిసి వరుడు ఉన్న హోటల్ వరకు గుర్రం మీద వెళ్లింది. వధువు రావడంతో హోటల్ నుంచి బయటకు వచ్చిన వరుడు కారు ఎక్కి ఆమెను అనుసరించాడు. 


ఈ ఊరేగింపు ఆ నగరంలో చర్చనీయాంశంగా మారింది. వధువుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. `ఎప్పుడూ అబ్బాయిలే ఎందుకు గుర్రపు స్వారీ చేయాలి. అమ్మాయిలు ఎందుకు చేయకూడదు. అందుకే నేను ప్రయత్నించా. నా నిర్ణయాన్ని నాకు కాబోయే భర్త కూడా సమర్థించారు. అతనికి ధన్యవాదాలు. అమ్మాయిలెవరూ తమకు నచ్చిన పని చేసేందుకు సిగ్గుపడకూడద`ని అనుష్క పేర్కొంది.  

Updated Date - 2021-12-15T19:28:26+05:30 IST