cops raid: పెళ్లి మండపం నుంచి వధూవరులు పరార్

ABN , First Publish Date - 2021-07-19T17:51:23+05:30 IST

పెళ్లి మండపానికి వచ్చిన పోలీసులను చూసి నూతన వధూవరులు పారిపోయిన ఘటన...

cops raid: పెళ్లి మండపం నుంచి వధూవరులు పరార్

కటక్ (ఒడిశా): పెళ్లి మండపానికి వచ్చిన పోలీసులను చూసి నూతన వధూవరులు పారిపోయిన ఘటన ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో తాజాగా వెలుగుచూసింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన వరుడికి బాలాసోర్ పట్టణానికి చెందిన యువతితో వివాహం చేశారు. బాలాసోర్ పట్టణంలోని 16వ నంబరు జాతీయ రహదారి పక్కన చహాపులియా చౌక్ వద్ద  ఉన్న హోటల్ మంగళ నిలయంలో వీరి వివాహ వేడుక సాగుతోంది. కొవిడ్ నిబంధనలు పాటించకుండా హోటల్ మంగళ నిలయంలోని పెళ్లి మండపంలో పెళ్లి చేస్తున్నారని సోరో పోలీసులకు సమాచారం వచ్చింది. అంతే పోలీసులు హుటాహుటిన హోటల్ మంగళ నిలయంలోని పెళ్లి మండపంపై దాడి చేశారు. పోలీసులను చూసిన నూతన వధూవరులిద్దరూ పెళ్లి మండపం నుంచి పారిపోయారు.


 నూతన వధూవరులు పారిపోవడంతో పెళ్లికి వచ్చిన అతిథులు షాక్‌కు గురయ్యారు. పెళ్లికి అనుమతి తీసుకున్నా నిబంధనల ప్రకారం 25 మంది మాత్రమే వేడుకలో పాల్గొనాలి. కానీ ఎక్కువ మంది అతిధులను పిలిచి ఆర్భాటంగా పెళ్లి చేస్తుండగా పోలీసులు కరోనా నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు చేసి హోటల్ యజమానికి రూ.3వేలు, వరుడు తండ్రికి రూ.5వేలు జరిమానా విధించారు. ఈ విషయాన్ని పోలీసు ఇన్‌స్పెక్టరు మధుమిత మహంతి తెలియజేశారు. ఈ నెల ప్రారంభంలో కటక్ నగరంలోనూ కరోనా నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి చేసిన నిర్వాహకులకు పోలీసులు రూ.50వేల జరిమానా విధించారు. ఒడిశా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2వేల నుంచి 5 వేల మార్కుకు చేరింది. ఒడిశాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.


Updated Date - 2021-07-19T17:51:23+05:30 IST