ఉక్కపోతగా ఉందని డాబా మీదకు వరుడు.. వెంటనే వధువు ఏం చేసిందంటే..
ABN , First Publish Date - 2022-06-02T14:54:47+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో...
ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో వరుడిని మోసం చేసి వధువు పరారైంది. ఆ నవ వధువు బంగారు, వెండి ఆభరణాలతో పాటు 11 వేల నగదు, మొబైల్ కూడా తీసుకుపోయింది. ఈ కేసులో వరుడి తరపున పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఉదంతం యూపీలోని కత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలియా దరోబస్త్లో చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన రమేష్ పాల్ సింగ్ కుమారుడు రింకూ సింగ్ వివాహం ఖుషినగర్ జిల్లా పటావా పోలీస్ స్టేషన్ పరిధిలోని కాజల్తో జరిగింది. మే 28న వధువు అత్తవారింటికి చేరుకుంది. పెళ్లి పనులలో అలసిపోయిన వారంతా నిద్రలోకి జారుకున్నారు.
ఆ రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో కరెంటు పోయింది. ఉక్కపోతకు తట్టుకోలేక వరుడు రింకూ టెర్రస్పైకి వెళ్లి పడుకున్నాడు. దీనిని అవకాశంగా తీసుకున్న వధువు 11 వేల నగదు, మొబైల్ ఫోను, బంగారు, వెండి నగలు సహా ఇతర వస్తువులను తీసుకువెళ్లిపోయిందని వరుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఉదయం కరెంటు రావడంతో రింకూ తమ గదిలోకి వెళ్లి చూడగా అక్కడ భార్య కనిపించలేదు. ఇంటి మెయిన్ గేటు కూడా తెరిచి ఉంది. భార్య నంబర్కు ఫోన్ చేయగా, మొబైల్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. అత్తమామలను సంప్రదించినా ఫలితం లేకపోయింది. రెండు రోజులు దాటినా వధువు తిరిగి రాలేదు. దీని వెనుక ప్రేమ వ్యవహారం ఉండివుంటుందని వరుడి కుటుంబీకులు అనుమానిస్తున్నారు. నగలతోపాటు వధువు అదృశ్యమైనట్లు వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.