WTC Final: న్యూజిలాండ్కే విజయాకాశాలు ఎక్కువ!
ABN , First Publish Date - 2021-06-04T22:15:12+05:30 IST
సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకు భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న ప్రపంచటెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకు భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న ప్రపంచటెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సామాన్యులే కాదు క్రీడా ప్రముఖులు కూడా ఈమ్యాచ్పై ఆసక్తి చూపుతున్నారు. ఈ మ్యాచ్లో విజయం ఎవరిని వరిస్తుందనే విషయంలో ఒక్కొక్కరూ ఒక్కో వాదన వినిపిస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ బ్రెట్ లీ కూడా ఈ మ్యాచ్ గురించి స్పందించాడు.
`ఈ మ్యాచ్లో న్యూజిలాండ్కే విజయావకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఇక్కడి పిచ్పై వారు బ్యాటింగ్ చేస్తుంటే అది వారి సొంత గ్రౌండ్లో ఆడినట్టుగా ఉంటుంది. ఇంగ్లండ్ పిచ్లు కివీస్కు సరిగ్గా సరిపోతాయి. స్పిన్, స్వింగ్, ఫాస్ట్ బౌలింగ్.. ఇలా ఏ అంశం చూసుకున్నా కివీస్కే అడ్వాంటేజ్ కనిపిస్తోంది. ఈ మ్యాచ్లో బౌలర్లదే కీలకపాత్ర. ముఖ్యంగా స్వింగ్ బౌలర్లు ఫలితాన్ని ప్రభావితం చేస్తారు. కోహ్లీ, విలయమ్సన్ తమ టీమ్లను ఎలా నడిపిస్తారో చూడాలి. విశేషమేమిటంటే.. వీరిద్దరూ ఇప్పటివరకు ఐసీసీ నిర్వహించిన ఏ మేజర్ టోర్నీలోనూ తమ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. అయితే ఈ సారి వీరిద్దరిలో ఎవరో ఒకరు విజేతగా నిలుస్తారు. అదెవరో చూడాల`ని బ్రెట్ లీ వ్యాఖ్యానించాడు.