‘ఇన్స్టాగ్రామ్ కిడ్స్’కు విరామం
ABN , First Publish Date - 2021-10-02T05:34:28+05:30 IST
ఇన్స్టాగ్రామ్ ‘కిడ్స్’ ప్రస్తుతానికి పక్కన పడింది. పదమూడేళ్ళ లోపు వయస్కులకు ప్రత్యేకించి విభాగాన్ని ఏర్పాటు చేసే యత్నాలకు ఫేస్బుక్ విరామం ...
ఇన్స్టాగ్రామ్ ‘కిడ్స్’ ప్రస్తుతానికి పక్కన పడింది. పదమూడేళ్ళ లోపు వయస్కులకు ప్రత్యేకించి విభాగాన్ని ఏర్పాటు చేసే యత్నాలకు ఫేస్బుక్ విరామం ఇచ్చింది. ఇదే విషయాన్ని ‘ఇన్స్టాగ్రామ్’ అధినేత అదామ్ మోసెరి ఒక బ్లాగ్లో తెలిపారు. ఈ విషయంలో తల్లిదండ్రులు, విధానకర్తలు, నిపుణులతో కలిసి పనిచేస్తున్నామని, వారి ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ మధ్యలో వాల్స్ట్రీట్ జర్నల్ - ఇన్స్టాగ్రామ్ను ఉపయోగించిన టీనేజ్ అమ్మాయిలు ఎలా మానసిక క్షోభకు గురయ్యారో ఫేస్బుక్కు తెలుసంటూ ఒక కథనాన్ని ప్రచురించింది. వేర్వేరు గ్రూపుల నుంచి కూడా ఆందోళనలు వెలువడుతున్న నేపథ్యంలోనే టిక్టాక్, యూట్యూబ్ మాదిరిగా ఇన్స్టాగ్రామ్లోనూ వారికో వేదిక ఉండాలని మోసెరి తన బ్లాగులో అభిప్రాయపడ్డారు. అలాగే కిడ్స్ అనేది 10 -12 ఏళ్ళ వారి కోసం మాత్రమేనని కూడా తెలిపారు. ఇందులో చేరేందుకు వారి తల్లిదండ్రుల అనుమతి ఉండాలని పేర్కొన్నారు. ప్రస్తుతానికి విరామం ప్రకటించినప్పటికీ తల్లిదండ్రుల పర్యవేక్షణ కోసం అవసరమైన టూల్స్ను అభివృద్ధిపరుస్తున్నట్టు తెలిపారు.