హైవేలపై 120 కి.మీ వేగానికి బ్రేక్!
ABN , First Publish Date - 2021-09-15T09:44:44+05:30 IST
హైవేలపై గంటకు 120కి.మీ వేగంతో వాహనాలు ప్రయాణించేందుకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు రద్దు చేసిన మద్రాస్ హైకోర్టు
చెన్నై, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): హైవేలపై గంటకు 120కి.మీ వేగంతో వాహనాలు ప్రయాణించేందుకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది. వాహనాల వేగాన్ని నియంత్రిస్తూ తాజా ఉత్తర్వులివ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 2013లో కాంచీపురం సమీపంలో రోడ్డు ప్రమాదం కారణంగా ఓ దంతవైద్యుడు మృతి చెందిన కేసులో కింది కోర్టు ఇచ్చిన నష్టపరిహారాన్ని పెంచాలని అభ్యర్థిస్తూ దాఖలైన అప్పీల్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.కృపాకరన్ (ప్రస్తుతం రిటైర్డ్), జస్టిస్ టీవీ తమిళ్సెల్విల హైకోర్టు ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్పై గతంలో జరిగిన విచారణ సందర్భంగా ఎక్స్ప్రెస్ హైవేలపై గంటకు 120 కి.మీ, జాతీయ రహదారులపై గంటకు 100 కి.మీ వేగంతో వాహనాలు ప్రయాణించవచ్చంటూ 2018 ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను పునఃపరిశీలించాలని హైకోర్టు సూచించింది.