బ్రాహ్మణుడు - ముగ్గురు దొంగలు

ABN , First Publish Date - 2021-01-11T05:51:48+05:30 IST

సింహాద్రిపురంలో నివసించే ఓ బ్రాహ్మణుడికి పొరుగూరిలో పూజా కార్యక్రమాలు నిర్వహించినందుకు ఒక మేకను బహుమతిగా ఇచ్చారు.

బ్రాహ్మణుడు - ముగ్గురు దొంగలు

సింహాద్రిపురంలో నివసించే ఓ బ్రాహ్మణుడికి పొరుగూరిలో పూజా కార్యక్రమాలు నిర్వహించినందుకు ఒక మేకను బహుమతిగా ఇచ్చారు. దాన్ని భుజాలపైన ఎత్తుకుని సంతోషంగా ఇంటి బాటపట్టాడు. దారిలో ముగ్గురు దొంగలు బ్రాహ్మణుడిని గమనించారు. అతని దగ్గర ఉన్న మేకను ఎలాగైనా దొంగిలించాలని పథకం పన్నారు. అందులో భాగంగా ముగ్గురూ  బ్రాహ్మణుడికి కనిపించకుండా ముందుకు వెళ్లారు.


అందులో ఒకడు ముందుగా బ్రాహ్మణుడికి ఎదురుపడి ‘‘ఓ బ్రాహ్మణా! భుజాలపై కుక్కను మోసుకెళుతున్నావు. మీలాంటి గొప్పవాళ్లు అలాంటి పనిచేయవచ్చా?’’ అని అడిగాడు. అప్పుడు బ్రాహ్మణుడు ‘‘కళ్లు కనిపించడం లేదా? నీకిది కుక్కలా కనిపిస్తోందా?’’ అని మండిపడ్డాడు. దాంతో ఆ దొంగ ‘‘నాదే తప్పు. మీరు ఏది తీసుకెళితే నాకేంటి!’’ అని వెళ్లిపోయాడు. కాస్త దూరం వెళ్లాక రెండో దొంగ ఎదురొచ్చి ‘‘ఓ బ్రాహ్మణోత్తమా! చనిపోయిన దూడను మోసుకెళుతున్నావు. ఎందుకు?’’ అని ప్రశ్నించాడు.


దాంతో బ్రాహ్మణుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. ‘‘నువ్వు కూడా గుడ్డోనివా? ఇంతకుముందొకడు కుక్క అన్నాడు. నువ్వు చనిపోయిన దూడ అంటున్నావు? నీకు మతికాని పోయిందా?’’ అన్నాడు. వెంటనే దొంగ ‘‘నన్ను క్షమించండి. నాకు కనిపించింది అన్నాను. మీరు చనిపోయిన దూడను తీసుకెళితే నాకేంటి? మేకను తీసుకెళితే నాకేంటి?’’ అంటూ జారుకున్నాడు.


మరికాస్త దూరం వెళ్లాక పథకంలో భాగంగా మూడో దొంగ ఎదురుపడి ‘‘నీవు నిజంగా బ్రాహ్మణుడివేనా?’’ అని అడిగాడు. ‘ఏం ఎందుకలా అడుగుతున్నావు. కళ్లు కనిపించడం లేదా?’’ అన్నాడు బ్రాహ్మణుడు. అలా అయుతే ఆ పందిని భుజాలపై ఎందుకు మోసుకెళుతున్నావు? అని అడిగాడు దొంగ. దాంతో బ్రాహ్మణుడికి అనుమానం పట్టుకుంది. నేను దయ్యాన్ని గానీ మోసుకెళుతున్నానా? ఒకడేమో కుక్క అన్నాడు. 


మరొకడు దూడ అన్నాడు. ఇప్పుడు వీడు పంది అంటున్నాడు అని భయపడి ఆ మేకను వదిలేసి పరుగు అందుకున్నాడు. వెంటనే ముగ్గురు దొంగలు మేకను తీసుకుని అక్కడి నుంచి జారుకున్నారు.


Updated Date - 2021-01-11T05:51:48+05:30 IST