మా నాన్న మమ్మల్ని పట్టించుకోవడం లేదు.. స్కూలు ఫీజు కట్టడం లేదు.. చిల్డ్రన్స్ కమిషన్‌కు ఓ బాలుడి లేఖ!

ABN , First Publish Date - 2021-12-18T18:37:15+05:30 IST

భార్య, భర్త మధ్య గొడవలు వచ్చాయి.. భార్యను, పిల్లలను వదిలేసి అతను వేరే ఇంట్లోకి మారిపోయాడు..

మా నాన్న మమ్మల్ని పట్టించుకోవడం లేదు.. స్కూలు ఫీజు కట్టడం లేదు.. చిల్డ్రన్స్ కమిషన్‌కు ఓ బాలుడి లేఖ!

ఆ భార్య, భర్త మధ్య గొడవలు వచ్చాయి.. భార్యను, పిల్లలను వదిలేసి అతను వేరే ఇంట్లోకి మారిపోయాడు.. భార్యపై కోపాన్ని పిల్లలపై చూపించాడు.. స్కూలు ఫీజు కట్టేది లేదని చెప్పాడు.. దీంతో ఆ పిల్లల చదువు ఆగిపోయింది.. దీంతో ఆ వ్యక్తి కొడుకు చిల్డ్రన్స్ కమిషన్‌కు లేఖ రాశాడు.. తండ్రి తమను పట్టించుకోవడం లేదని మొరపెట్టుకున్నాడు.. స్పందించిన చిల్డ్రన్స్ కమిషన్ ఆ వ్యక్తిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చింది.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ ఘటన జరిగింది. 


`నన్ను, అమ్మను, చెల్లిని వదిలేసి మా నాన్న వేరే ఇంటికి వెళ్లిపోయారు. ఇకపై ఫీజు కట్టనని స్కూలు యాజమాన్యానికి, ట్యూషన్ టీచర్‌కు చెప్పారు. మా ఇంటికి కరెంట్ కనెక్షన్ కూడా తీయించేయమని ఎలక్ట్రిసిటీ బోర్డుకు లేఖ రాశారు. మా ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదు. నేను ప్రస్తుతం చదువుకుంటున్నాను. ఇంటి భారం భరించలేను. నేను, మా చెల్లి ఆయనతో గొడవపడలేదు. అయినా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. దయచేసి మా నాన్నతో మాట్లాడండి` అని ఆ బాలుడు లేఖలో పేర్కొన్నాడు. 


ఆ లేఖపై చిల్డ్రన్స్ కమిషన్ మెంబర్ బ్రజేష్ చౌహాన్ వెంటనే స్పందించారు. ఆ బాలుడి తండ్రిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లలు పెద్దవారు అయ్యే వరకు వారి బాధ్యత తీసుకోవాలని సూచించారు. దాదాపు నాలుగు రోజుల కౌన్సిలింగ్ తర్వాత ఆ వ్యక్తి మనసు మార్చుకున్నాడు. తన పిల్లల బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చాడు. 


Updated Date - 2021-12-18T18:37:15+05:30 IST