పతకానికి పంచ్‌ దూరంలో..

ABN , First Publish Date - 2021-07-28T09:56:52+05:30 IST

భారత మహిళా బాక్సర్‌ లవ్లీనా బోర్గోహైన్‌కు ఇవే తొలి ఒలింపిక్స్‌. అయినా ఎలాంటి ఒత్తిడి లేకుండా సంచలన ప్రదర్శన కనబరిచింది. తనకన్నా అనుభవజ్ఞురాలైన ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తూ క్వార్టర్స్‌లో ...

పతకానికి పంచ్‌ దూరంలో..

  • క్వార్టర్స్‌లో బాక్సర్‌ లవ్లీనా
  • షూటింగ్‌లో మనూ జోడీకి నిరాశ
  • పురుషుల హాకీలో విజయం
  • టోక్యోలో ఐదో రోజు 

పతకం ఆశిస్తున్న క్రీడల్లో భారత్‌కు ఐదోరోజూ నిరాశే ఎదురైంది. అయితే ఈ పరాజయాలను  మరిపిస్తూ.. బాక్సర్‌ లవ్లీనా  బోర్గోహైన్‌ మాత్రం అరంగేట్ర ఒలింపిక్స్‌లోనే అదరగొట్టింది. ప్రీక్వార్టర్స్‌ను దాటి క్వార్టర్స్‌కు చేరుకుంది. ఇంకొక్క బౌట్‌ గెలిస్తే ఆమెకు కనీసం కాంస్యం ఖాయమవుతుంది. ఇక, పురుషుల హాకీ జట్టు స్పెయిన్‌పై గెలిచింది. మరోవైపు షూటింగ్‌లో మళ్లీ గురి తప్పింది. మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో మెడల్‌ గ్యారెంటీ  అంచనాలున్న సౌరభ్‌, మనూ భాకర్‌ జోడీ అసలు ఫైనల్‌ రౌండ్‌కు క్వాలిఫై కాలేకపోయింది. టేబుల్‌ టెన్నిస్‌ బరిలో మిగిలిన  శరత్‌ కమల్‌ పోరాటం కూడా ముగిసింది. 


టోక్యో: భారత మహిళా బాక్సర్‌ లవ్లీనా బోర్గోహైన్‌కు ఇవే తొలి ఒలింపిక్స్‌. అయినా ఎలాంటి ఒత్తిడి లేకుండా సంచలన ప్రదర్శన కనబరిచింది. తనకన్నా అనుభవజ్ఞురాలైన ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తూ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. మహిళల వెల్టర్‌ వెయిట్‌ 64-69 కేజీ విభాగం తొలి రౌండ్‌లో లవ్లీనాకు బై లభించింది. దీంతో మంగళవారం నేరుగా ప్రీక్వార్టర్స్‌లో తలపడిన ఆమె జర్మనీ వెటరన్‌ నడీన్‌ అపెట్జ్‌పై 3-2 తేడాతో నెగ్గింది. 23 ఏళ్ల ఈ అస్సామీ బాక్సర్‌కు నడీన్‌ నుంచి గట్టి పోటీ ఎదురుకావడంతో మూడు రౌండ్లలోనూ స్ప్లిట్‌ పాయింట్లతో గెలిచింది. ఎక్కువగా లెఫ్ట్‌ హుక్స్‌ను ఉపయోగిస్తూ తెలివిగా బౌట్‌ను ముగించింది. ప్రత్యర్థికి కూడా ఇదే తొలి ఒలింపిక్స్‌. ఇక 30న జరిగే క్వార్టర్స్‌లో లవ్లీనా మాజీ ప్రపంచ చాంపియన్‌ నీన్‌ చిన్‌ చెన్‌ను ఎదుర్కొంటుంది. ఇందులో గెలిచి సెమీ్‌సలో ఓడినా భారత్‌కు కాంస్యం దక్కుతుంది.


పురుషుల హాకీ

ఆస్ట్రేలియాతో దారుణ పరాభవం నుంచి పురుషుల హాకీ జట్టు త్వరగానే కోలుకుంది. స్పెయిన్‌తో జరిగిన పూల్‌ ‘ఎ’ మూడో మ్యాచ్‌లో 3-0తో గెలిచింది. సిమ్రన్‌జిత్‌ సింగ్‌ (14వ నిమిషంలో) తొలిగోల్‌ అందించగా డ్రాగ్‌ ఫ్లికర్‌ రూపిందర్‌ (15వ, 51వ) రెండు గోల్స్‌తో ఆధిక్యాన్ని పెంచాడు. భారత్‌ తదుపరి మ్యాచ్‌ను డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనాతో గురువారం ఆడనుంది.  


షూటింగ్‌

10మీ. ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో సౌరభ్‌ చౌధరి-మనూ బాకర్‌, అభిషేక్‌ వర్మ-యశస్విని జోడీలు ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు.  స్టేజి-1లో సౌరభ్‌-మనూ 582 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఆశలు రేపారు. అయితే స్టేజి-2లో మాత్రం వీరి గురి చెదిరింది. 380 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచారు. అభిషేక్‌ జోడీ అయితే స్టేజి-1 నుంచే నిష్క్రమించింది. ఇక 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ పోటీల్లో దివ్యాంశ్‌ పన్వర్‌-ఎలవెనిల్‌ 12వ స్థానంలో.. దీపక్‌ కుమార్‌-అంజుమ్‌ మౌద్గిల్‌ 18వ స్థానంలో నిలిచి నిరాశపరిచారు.  


టేబుల్‌ టెన్నిస్‌

శరత్‌ కమల్‌ పోరాటం మూడో రౌండ్‌లో ముగిసింది. 1-4 తేడాతో వరల్డ్‌ చాంపియన్‌ మా లాంగ్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. రెండో సెట్‌ను నెగ్గిన శరత్‌ మూడో సెట్‌లోనూ గట్టి పోటీనిచ్చాడు. కానీ చివర్లో పూర్తిగా తేలిపోవడంతో 7-11, 11-8, 11-13, 4-11, 4-11 తేడాతో ఇంటిముఖం పట్టాడు.


బ్యాడ్మింటన్‌

పురుషుల డబుల్స్‌లో భారత జోడీకి విజయం లభించినా క్వార్టర్స్‌లో అడుగుపెట్టలేకపోయింది. తమ గ్రూప్‌ ‘ఎ’ మూడో మ్యాచ్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జంట 21-17, 21-19తో వెండీ-లేన్‌ (బ్రిటన్‌)పై వరుస గేముల్లో గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌ ఆరంభానికి ముందే వరల్డ్‌ నెంబర్‌వన్‌, ఇండోనేసియా జోడీపై చైనీస్‌ తైపీ జంట నెగ్గి క్వార్టర్స్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. వాస్తవానికి గ్రూప్‌ ‘ఎ’లో భారత్‌, చైనీస్‌ తైపీ, ఇండోనేసియాలకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమి ఉన్నాయి. అయితే మిగతా రెండు జట్లకన్నా సాత్విక్‌-చిరాగ్‌ తక్కువ గేమ్స్‌ (4) గెలిచి, ఎక్కువ గేమ్స్‌ (3) ఓడడం జరిగింది. ఈ సమీకరణాలతో వీరికి నిరాశ తప్పలేదు.


టెన్నిస్‌

పురుషుల సింగిల్స్‌, మహిళల డబుల్స్‌ టెన్ని్‌సలో భారత్‌ పోరాటం ఇప్పటికే ముగియగా.. మిక్స్‌డ్‌ టీమ్‌పై ఆశలు కూడా ఆవిరయ్యాయి. ఈ విభాగంలో సానియా మీర్జా-సుమిత్‌ నగాల్‌ బరిలోకి దిగే అవకాశాలు కనిపించాయి. అయితే ఈ ఇద్దరి కంబైన్డ్‌ ర్యాంకింగ్‌ 153 కావడంతో మంగళవారం విడుదల చేసిన జాబితాలో భారత్‌కు చోటు దక్కలేదు. కటాఫ్‌ ర్యాంకింగ్‌ 50-60 మధ్యే ఉంది. దీంతో అధికారికంగా టెన్ని్‌సలో భారత్‌ పోరాటం ముగిసింది. 


సెయిలింగ్‌

పురుషుల లేజర్‌లో విష్ణు శరవణన్‌ మెరుగ్గా రాణిస్తున్నాడు. ఆరు రేసులు పూర్తయ్యేసరికి మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 22వ స్థానంలో నిలిచాడు. పురుషుల స్కిఫ్‌-49ఇఆర్‌ తొలి రేస్‌లో భారత జోడీ గణపతి-వరుణ్‌ 18వ స్థానంలో నిలిచింది. వర్షం కారణంగా రెండో రేసును వాయిదా వేశారు. ఇక మహిళల లేజర్‌ రేడియల్‌లో నేత్రా కుమనన్‌ ఐదో రేసులో 32, ఆరో రేసులో 33వ స్థానంలో నిలిచింది.


Updated Date - 2021-07-28T09:56:52+05:30 IST