విశాఖలో బాక్సర్ హత్య
ABN , First Publish Date - 2022-05-28T05:06:03+05:30 IST
మర్రిపాలెం రైల్వేక్వార్టర్స్లో గురువారం అర్ధరాత్రి ఓ బాక్సర్ హత్యకు గురయ్యాడు. దుండగులు కత్తులు, రాడ్లతో దాడిచేసి దారుణంగా చంపేశారు.
కత్తులు, రాడ్లతో దాడిచేసి చంపిన నిందితులు
పక్షం రోజుల క్రితం మృతుడు, నిందితుల మధ్య ఘర్షణ
విశాఖపట్నం, మే 27: మర్రిపాలెం రైల్వేక్వార్టర్స్లో గురువారం అర్ధరాత్రి ఓ బాక్సర్ హత్యకు గురయ్యాడు. దుండగులు కత్తులు, రాడ్లతో దాడిచేసి దారుణంగా చంపేశారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ పోర్టు పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. మర్రిపాలెం గాంధీనగర్కు చెందిన రేపాక సాయితేజ (23) బాక్సర్. ఈవెంట్స్ కూడా నిర్వహిస్తుంటాడు.
పదిహేను రోజుల క్రితం మర్రిపాలెం గ్రీన్గార్డెన్స్ ప్రాంతానికి చెందిన ప్రధాన నిందితుడు, జీవీఎంసీ కాంట్రాక్టు ఉద్యోగి బంగర్రాజుతోపాటు మరికొందరితో సాయితేజ ఘర్షణ పడ్డాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి సాయితేజ మద్యం సేవించేందుకు పాడుపడిన రైల్వేక్వార్టర్స్ వద్దకు వెళ్లడం వీరు గమనించారు. అర్ధరాత్రి 12.30 గంటల వరకు సాయితేజ అక్కడే ఉండడం గమనించి దాడిచేశారు. కత్తులు, రాడ్లతో దాడి చేయడంతో సాయితేజ అక్కడికక్కడే చనిపోయాడు.
ఆ ప్రాంతంలో మద్యం సేవిస్తున్న పలువురు యువకులు ఈ ఘటన చూసి పరారయ్యారు. తెల్లవారు జామున పోలీసులకు హత్య ఘటనపై సమాచారం అందడంతో ఉదయం ఆరు గంటల సమయంలో ఏసీపీ పెంటారావు, ఎయిర్ పోర్టు పోలీసులు ఘటనా స్థలిని సందర్శించారు. సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించగా నిందితుల దాడి దృశ్యాలు నమోదై ఉండడతో బంగార్రాజు, అతని అనుచరులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
తొలుత తమకు సంబంధం లేదని వీరు బుకాయించినా పోలీసులు వీడియో దృశ్యాలు చూపించడంతో నేరం చేసినట్లు అంగీకరించారు. మృతుడు అవివాహితుడు. తల్లి, ఇద్దరు సోదరిలు ఉన్నారు. తండ్రి ఆటో డ్రైవర్. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.