సోషలిజం ఒక పథకం కాకూడదని హెచ్చరించాడు బౌమన్‌

ABN , First Publish Date - 2022-08-08T05:55:16+05:30 IST

సమాజాన్ని గురించి లోతైన విశ్లేషణ చేసిన సిద్ధాంతాలలో మార్క్సిజం అత్యంత కీలకమైనది. అయితే, అది తెలుగు సమాజంలో ఒక విశ్వాసంగా...

సోషలిజం ఒక పథకం కాకూడదని హెచ్చరించాడు బౌమన్‌

మీ ‘పోస్టు మోడర్నిజం’ పుస్తకం వచ్చిన దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ ‘బౌమనీయం- ఆధునికత నుంచి ద్రవా ధునికత దాకా’ పుస్తకం తేవటానికి ప్రేరణ?

సమాజాన్ని గురించి లోతైన విశ్లేషణ చేసిన సిద్ధాంతాలలో మార్క్సిజం అత్యంత కీలకమైనది. అయితే, అది తెలుగు సమాజంలో ఒక విశ్వాసంగా ఘనీభవించటం వల్ల అందులో సృజనాత్మక అన్వయం లోపించి వాస్తవికతను ఇంకా మొరటు వర్గీకరణల నుంచి విశ్లేషించే విఫల ప్రయత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో సమాజపు వర్తమాన వాస్తవికతను అత్యంత సూక్ష్మక్షేత్రాలలో నుంచి చూసి, అనేక కోణాల్లోంచి విశ్లేషించిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త జిగ్మంట్‌ బౌమన్‌ ఆలోచనలను తెలుగు సమా జానికి పరిచయం చేయాలని చేసిన ప్రయత్నం ఫలితం ఈ ‘భౌమనీయం’. నిజానికి ఈ పుస్త కాన్ని మరో ఇద్దరు మిత్రులు, ప్రముఖ మానవ హక్కుల నేత బి. చంద్రశేఖర్‌; ప్రముఖ కవి, చిత్ర దర్శకుడు దాము బాలాజీలతో కలిసి రాయాల్సింది. చంద్రశేఖర్‌ క్యాన్సర్‌తో అకాలంగా మరణించటం, దాము సినిమాలలో బిజీగా ఉండటం వల్ల అది కుదరలేదు.


‘ద్రవాధునికత’ను క్లుప్తంగా వివరిస్తారా? 

ఆధునికతకు మరింత సంక్షోభపూరితమైన కొనసాగింపు ద్రవాధునికత. ద్రవం ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారినట్లు వ్యక్తులు ఒక సామాజిక స్థితి నుంచి మరొక సామాజిక స్థితికి తమను తాము నిరంతరం మార్చుకోవా ల్సిన అవసరంలోకి నెట్టబడుతున్నారు. వర్తమాన సమాజంలో నిరంతర అస్థిరతతో, తీవ్రమైన మార్పులకు గురవుతున్న మానవసంబంధాలు, గుర్తింపులు, గ్లోబల్‌ ఆర్థికాంశాలు మొదలైన వాటి స్వభావాన్ని తెలియజేసేందుకు జిగ్మంట్‌ బౌమన్‌ ద్రవాధునికతను ఒక మెటఫర్‌గా వాడాడు. ఇది గ్లోబలీకరణ చెందిన పెట్టుబడిదారీ విధానపు స్థితి. సంచార జీవితం అనేది వర్తమానాన్ని నిర్దేశిస్తున్న జీవన విధానం. ద్రవ మానవుడు ఒక టూరిస్టు లాగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి, ఒక విలువ నుంచి మరొక విలువకి మారటం అని వార్యం అవుతోంది. సామాజిక చట్రాల, సంస్థల నియంత్రణ వ్యక్తి మీద ఉండటం లేదు. వ్యక్తులు ఏ నియంత్రణ నైనా సునాయాసంగా అధిగమిం చగలుగుతున్నారు. తమ వైయక్తిక ఇష్టానికి అనుగుణంగా, తన ఎన్నిక ప్రకారం జీవిస్తు న్నాడు. వినిమయమే జీవనసూత్రం అయింది. ద్రవాధునికతకు వినిమయ వాదానికి దగ్గర సంబంధం ఉంది. ద్రవాధునిక సమాజం మనుషుల్ని ప్రధానంగా వినియోగదారులుగా చూస్తుంది, ఆ తరువాతే వాళ్లు ఉత్పత్తిదారులు. శ్రమకు పెట్టుబడికి ఉన్న సంబంధం క్రమంగా బలహీనపడటం, పెట్టుబడి సామాజిక సంబంధాలను క్షీణింపచేయటం, అనిశ్చితి, అభద్రత అనేవి సమాజాన్ని ఆవరించి ఉండి వ్యక్తి అస్తి త్వానికి ఎటువంటి హామీ లేక పోవటం లాంటివి ద్రవాధునికత లక్షణాలు. ఆధునికత తన పూర్వ ఘనస్థితి నుండి ద్రవస్థితిలోకి మారిన సందర్భంలో సామాజిక సంస్థలు లేక రూపాలు ఏమీ కూడా స్థిరపడకముందే అంత ర్థానం అవుతున్న సందర్భంలో వ్యక్తులు తమ చర్యలకు, దీర్ఘ కాలిక ప్రణాళికలకు ఎటువంటి సూచి కేంద్రాలు లేని స్థితిలో ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఆందోళన ఫలితంగా వ్యక్తుల జీవితాలు శకలీకరణ (fragmentation)కు గురై అన్ని నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి కేవలం తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడమే లక్ష్యంగా మనుషులు పరుగులు తీస్తున్న కాలం.


మన సమకాలీన తెలుగు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ద్రవాధునికత ఏ విధంగా సహాయ పడుతుంది?

తెలుగు సమాజంలో సామాజిక శాస్త్ర అవగా హన లేక తాత్త్విక అవగాహన ఏమాత్రం లేని కొంతమంది మనకు ఆధునిక తేలేదు ఆధునికా నంతరత ఎక్కడ? ద్రవాధునికత ఎక్కడ? అని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. వీళ్లు ఆధునికతను కేవలం ఒక ఆర్థిక అంశంగానే కుదించి ఆలోచిస్తు న్నారు. ఆధునికతకు సాంస్కృతిక కోణం ఉంది. అంటే భావజాల రంగంలో దానికి ఆర్థిక అంశాలను శాసించగలిగేశక్తి కూడా ఉంటుంది. ఇవాళ సగటు మనిషి జీవితాన్ని నిర్దేశించేది ద్రవాధునికత భావ జాలం. వినిమయవాదం ప్రధానంగా సగటు జీవితం నడుస్తోంది సామాజిక జీవితాన్ని కట్టిపడేసే ఉంచే ఘన, స్థిర విలువలు, సంస్థలు ఏవి మిగల టం లేదు. వ్యక్తి కేంద్రక విలువలు మాత్రమే సామాజిక జీవితాన్ని, క్రమాన్ని నడిపేస్తు న్నాయి. ఈ మొత్తం పరిణామాలను వాటి సూక్ష్మ క్షేత్రాలలో నుంచి అవగతం చేసుకో వడానికి బౌమన్‌ ఆలోచ నలు అవసరం. 


వర్తమాన సంక్లిష్టతలకి ‘బౌమనీయం’ ఏమైనా పరిష్కారాలు చూపుతుందా? 

సంక్లిష్టత ఎక్కడెక్కడ, ఏఏ రూపాల్లో ఉందో గుర్తించటానికి బౌమన్‌ విశ్లేషణలు అత్యవసరం. సమస్యలను లేక విషయాలను వాటి వాటి సూక్ష్మ క్షేత్రాల్లోకి వెళ్లి విశ్లేషించకుండా పరిష్కారాల ప్రాతిపదికగా విషయాలను విశ్లేషించటం, మన మంచి కోర్కెలకు అనుగుణంగా చారిత్రిక అనివా ర్యతను ఊహించడం, సందర్భాలను వ్యాఖ్యానిం చడం, ఆ వ్యాఖ్యానాల ఆధారంగా సమాజాలను మార్చాలని ప్రయత్నించటం ఎటువంటి విపరీత పరిణామాలకు దారితీస్తుందో ఇటీవలే మనం చూశాం. అందువల్ల నిరంతరం అత్యంత వేగంతో మారిపోతున్న సామాజిక వాస్తవికతను అంతే వేగవంతంగా మనం అర్థం చేసుకోగలగాలి. అందుకు బౌమన్‌ ఆలోచనలు తప్పనిసరిగా ఉపయోగపడతాయి. బౌమన్‌ కూడా మనలో చాలామంది లాగానే సమానత్వ భావనను, సోషలిజాన్ని బలంగా కోరుకున్నాడు, అయితే  అది ఒక పథకం కాకూడదని హెచ్చరించాడు.

94404 08982


వర్తమాన సమాజంలో నిరంతర అస్థిరతతో, తీవ్రమైన మార్పులకు గురవుతున్న మానవ సంబంధాలు, గుర్తింపులు, గ్లోబల్‌ ఆర్థికాంశాలు మొదలైన వాటి స్వభావాన్ని తెలియజేసేందుకు జిగ్మంట్‌ బౌమన్‌ ద్రవాధునికతను ఒక మెటఫర్‌గా వాడాడు.


Updated Date - 2022-08-08T05:55:16+05:30 IST