సర్వజనాస్పత్రిలో ధోబీ కష్టాలు

ABN , First Publish Date - 2020-07-11T10:39:33+05:30 IST

జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో ధోబీ కష్టాలు వెంటాడుతున్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత అవసరం. అందుకే రోజూ

సర్వజనాస్పత్రిలో ధోబీ కష్టాలు

ఇద్దరే శుభ్రం చేయాల్సిన దుస్థితి..

కొత్త నియామకాల్లోనూ పోస్టులు కేటాయించని వైనం..



అనంతపురం వైద్యం, జూలై10: జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో ధోబీ కష్టాలు వెంటాడుతున్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత అవసరం. అందుకే రోజూ ఆస్పత్రిలో బెడ్‌షీట్లు, శస్త్ర చికిత్సలకు వినియోగించే దుస్తులు, పరికరాలను ఉతికి శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఆస్పత్రిలో 24 విభాగాలున్నాయి. రోజూ ప్రసవాలు ఇతరత్రా శస్త్ర చికిత్సలు చేస్తుంటారు. వార్డుల్లో వినియోగించే బెడ్‌షీట్లను రెండు రోజులకోసారి శుభ్రం చేయాల్సి ఉంటుంది. శస్త్ర చికిత్సలకు వాడే దుస్తులు, బెడ్‌సీట్లు రోజూ ఉతకాలి. ఇందుకు ఇద్దరు ధోబీలు మాత్రమే ఉన్నారు. వారే ఆస్పత్రిలోని అన్ని విభాగాల దుస్తులు తీసుకెళ్లి, శుభ్రం చేయాల్సి వస్తోంది.


వారికి వారాంతపు సెలవు కూడా ఇవ్వట్లేదు. నిరంతరం ఆస్పత్రిలో పని చేయాల్సి వస్తోంది. దీంతో ఆ ఇద్దరు ధోబీలు అనేక కష్టాలు పడుతున్నారు. ఆస్పత్రి సామర్థ్యం పెరిగినా, రోగుల సంఖ్య పదింతలైనా ఇద్దరు ధోబీలే ఉంటున్నారు. మరో ముగ్గురిని నియమించాలని ఏళ్లుగా కోరుతున్నా.. పట్టించుకునేవారే కరువయ్యారు. తాజాగా ఆస్పత్రిలో వివిధ విభాగాలకు సంబంధించి 267 పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించుకోవటానికి నోటిఫికేషన్‌ ఇచ్చారు. అందులో కూడా ధోబీ పోస్టులు కేటాయించకపోవటం అన్యాయమని ఆస్పత్రివర్గాలే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి, దోబీ పోస్టులను కేటాయించి సమస్య లే కుండా చూడాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.

Updated Date - 2020-07-11T10:39:33+05:30 IST