ఏపీ పరిస్థితులపై కేటీఆర్ చేసిన సంచలన వ్యాఖ్యలకు బొత్స కౌంటర్
ABN , First Publish Date - 2022-04-29T20:10:37+05:30 IST
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీ రహదారులు, నీళ్లు, కరెంటుపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.
అమరావతి : తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీ రహదారులు, నీళ్లు, కరెంటుపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తాను హైదరాబాద్లోనే ఉండి వస్తున్నానని.. అక్కడ కరెంటు లేదని.. తాను అక్కడ జనరేటర్ పెట్టుకుని ఉండాల్సి వచ్చిందన్నారు. కావాలంటే వారి ఘనత వారు చెప్పుకోవాలని.. ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని బొత్స హితవు పలికారు. ‘‘కేటీఆర్ చెప్పినట్టయితే మనం రోడ్డు మీద నిలబడి మాట్లాడడం లేదా? ఆయనకు ఆయన ఫ్రెండ్ చెప్పాడు... నేను హైదరాబాద్లో ఉండి వస్తున్నా. అక్కడ కరెంటే లేదు. నేను కూడా అక్కడ జనరేటర్ పెట్టుకుని ఉండాల్సి వచ్చింది. కావాలంటే వారి ఘనత వారు చెప్పుకోవచ్చు. అంతేగానీ ఇలా అంటారా? ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపిస్తున్నా. బాధ్యత గల వ్యక్తులు అలా మాట్లాడోచ్చా? ఆయన తన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలి’’ అని బొత్స పేర్కొన్నారు.
ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్లు ఉంది...
కాగా.. నేటి ఉదయం మంత్రి కేటీఆర్ ఏపీ పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్, మాదాపూర్ హైటెక్స్లో జరుగుతున్న క్రెడాయ్ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీలో కరెంట్, నీటి సౌకర్యం లేదని, రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. ఈ విషయం ఏపీకి వెళ్లొచ్చిన తన స్నేహితులు చెబుతున్నారన్నారని, ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్లు ఉందని చెప్పారన్నారు. అనుమానం ఉంటే.. ఎవరైనా ఏపీకి వెళ్లిరండని మంత్రి కేటీఆర్ సలహా ఇచ్చారు. ఏపీతో పోలిస్తే.. తెలంగాణలో రోడ్లు, మౌలిక సదుపాయాలు బాగున్నాయని చెప్పారు.