AP: డబ్బుల మాయంపై ఆర్థికశాఖ అధికారులను కలిశాం: Bopparaju
ABN , First Publish Date - 2022-06-29T20:52:51+05:30 IST
జీపీఎఫ్ డబ్బుల మాయంపై ఆర్థికశాఖ అధికారులను కలిశామని ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు అన్నారు.
అమరావతి (Amaravathi): జీపీఎఫ్ డబ్బుల మాయంపై ఆర్థికశాఖ అధికారులను కలిశామని ఏపీ ఉద్యోగుల యూనియన్ నేత బొప్పరాజు (Bopparaju) అన్నారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై నిన్నటి నుంచి ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని చెప్పారు. గతేడాది మాదిరిగానే ఎందుకిలా జరిగిందని అడిగామన్నారు. డబ్బులు క్రెడిట్, డెబిట్ అయినట్లు చూపడం సరికాదని ప్రశ్నించామన్నారు. దీనిపై డైరెక్టర్ అఫ్ ట్రెజరీస్ను వివరణ కోరామని ఉన్నతాధికారులు చెప్పారని, ఈ అంశంలో క్లారిటీ ఇవ్వాలని ఫైనాన్స్ అధికారులను కోరినట్లు బొప్పరాజు వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90వేల మంది ఉద్యోగులు... వారికి చెందిన రూ.800 కోట్ల జీపీఎఫ్ నిధులు మాయమైపోయాయి! ఉద్యోగులకు తెలియకుండా, వారి సమ్మతి లేకుండానే ప్రభుత్వం ఆ సొమ్మును లాగేసుకుంది. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, కుటుంబ సభ్యుల వైద్య చికిత్స కోసం జీపీఎఫ్ నుంచి అడ్వాన్సు ఇప్పించాలని ఉద్యోగులు పెట్టుకున్న దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్లో ఉండగా.... ఇప్పుడు వారి ఖాతాలను ఖాళీ చేయడం కలకలం సృష్టిస్తోంది. అకౌంటెంట్ జనరల్ కార్యాలయం(ఏజీ) గత ఆర్థిక సంవత్సరం ఉద్యోగుల జీపీఎఫ్ వార్షిక స్టేట్మెంట్ను వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఆ లావాదేవీలను చూసుకున్న ఉద్యోగులకు అసలు సంగతి తెలిసింది. తమ ఖాతాల నుంచి తమకు తెలియకుండానే సొమ్ము డెబిట్ అయినట్లు తేలింది. డీఏ బకాయిలు చెల్లించాలని ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో జూలై 2018, జనవరి 2019 డీఏ బకాయిలను ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేసింది. ఆ తర్వాత కొంతకాలానికి వారికి తెలియకుండానే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంది.