నిపుణుల సలహా మేరకే బూస్టర్ డోసు, పిల్లలకు టీకా
ABN , First Publish Date - 2021-12-04T06:36:47+05:30 IST
దేశంలో బూస్టర్ డోసు, పిల్లలకు కొవిడ్ టీకా పంపిణీపై నిపుణుల సలహా మేరకు నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ...
లోక్సభలో కేంద్ర మంత్రి జవాబు
న్యూఢిల్లీ, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): దేశంలో బూస్టర్ డోసు, పిల్లలకు కొవిడ్ టీకా పంపిణీపై నిపుణుల సలహా మేరకు నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. కొవిడ్-19పై శుక్రవారం లోక్సభలో జరిగిన 11 గంటల సుదీర్ఘ చర్చలో పలువురు సభ్యులు బూస్టర్ డోసు పంపిణీ అంశాన్ని, కొత్త వేరియంట్ ఒమైక్రాన్పై ఆందోళన వ్యక్తం చేశారు. మాండవీయ స్పందిస్తూ.. ముప్పు జాబితాలోని దేశాల నుంచి వచ్చిన 16 వేల మందికి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేశామని.. వీరిలో 18 మందికి కరోనా పాజిటివ్గా తేలిందని చెప్పారు. వీరి నమూనాలను జన్యు విశ్లేషణకు పంపామన్నారు. అర్హులందరికీ టీకా పంపిణీ చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని వివరించారు. ఇప్పటివరకు 85 శాతం మంది తొలి డోసు, 50 శాతం మంది రెండో డోసు పొందారని స్పష్టం చేశారు. వ్యాక్సిన్లపై అపోహలు కలిగించేలా ప్రతిపక్షాలు వ్యవహరించాయని.. ఇది పంపిణీపై ప్రభావం చూపిందని విమర్శించారు. రాష్ట్రాల్లోని బీజేపీయేతర ప్రభుత్వాలు.. ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో వ్యాక్సినేషన్కు మద్దతు తెలిపి తర్వాత మాట మార్చాయని ధ్వజమెత్తారు. కొవిడ్ టీకా పంపిణీపై ఏర్పాటైన నిపుణుల కమిటీ, జాతీయ సాంకేతిక సలహా కమిటీలు.. 12 నుంచి 17 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్పై శాస్త్రీయ ఆధారాలను పరిశీలిస్తున్నాయని కేంద్ర ఆరో గ్య శాఖ సహాయ మంత్రి భారతీ పవార్ లోక్సభకు తెలిపారు. పిల్లలు, కౌమార దశలో ఉన్నవారి కోసం టీకాలు దిగుమతి చేసేందుకు సంబంధించి ఏ ప్రతిపాదనలు పెండింగ్లో లేవని వెల్లడించారు.