‘బూస్టర్’ కనికట్టు
ABN , First Publish Date - 2022-08-11T05:34:53+05:30 IST
జిల్లాలో జరుగుతున్న బూస్టర్డోసు వ్యాక్సినేషన్ పక్కదోవ పడుతోందనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
వ్యాక్సిన్ వేయకుండానే వేసినట్టు
ఎస్ఎంఎస్లు, సర్టిఫికెట్లు
లబ్ధిదారుల్లో అయోమయం
రికార్డుల్లో స్టాకు జీరో
పీహెచ్సీల్లో ఎక్స్పైరీలకు దగ్గరలో టీకా నిల్వలు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిర్వాకం
జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడు కొన్ని నెలల క్రితమే అనా రోగ్యంతో మృతి చెందారు. ఈయన ఫోన్ నెంబరుకు కొద్దిరోజుల క్రితం ఓ ఎస్ఎంఎస్ వచ్చింది. ‘మీరు కొవిడ్ ప్రికాషన్ (బూస్టర్) డోసు వేయించుకున్నారు. ఆన్లైన్లో మీ పేరు విజయవంతంగా నమోదైంది. మీరు వ్యాక్సినేషన్ పూర్తయినట్టుగా ద్రువీకరణ పత్రం తీసుకోవచ్చు.’ అని మెసేజ్ వచ్చింది. నెలల క్రితమే మృతి చెందిన వ్యక్తికి ఈరోజు బూస్టర్ డోసు వేసినట్టు వైద్య ఆరోగ్యశాఖ నుంచి సందేశం రావడంతో గుడివాకలంక గ్రామానికి చెందిన ఆ మృతుని కుటుంబసభ్యులంతా ఆశ్చర్యపోయారు. తాజాగా సోమవారం జరిగిన ఓ ఘటనలో ఏలూరుకు చెందిన ఓ వ్యక్తికి కూడా ఇదే రకమైన సందేశం రావడంతో ముక్కున వేలేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం కూడా ఇలాగే మరికొందరికి ఎస్ఎంఎస్లు రావడం అయోమయానికి దారితీసింది.
ఏలూరు ఎడ్యుకేషన్, ఆగస్టు 10 : జిల్లాలో జరుగుతున్న బూస్టర్డోసు వ్యాక్సినేషన్ పక్కదోవ పడుతోందనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అసలు వ్యాక్సినే వేయకుండా వ్యాక్సినేషన్ పూర్తయిందంటూ ఆన్లైన్లో లబ్ధిదారుల పేర్లు నమోదు చేస్తుండటం ఓ తప్పిదమైతే, వ్యాక్సి నేషన్ జరిగే పీహెచ్సీల మెడికల్ ఆఫీసర్ల లాగిన్ల లోకి అక్ర మంగా చొరబడి లబ్ధిదారులకు వ్యాక్సిన్ వేయకుండానే బూస్టర్ డోసు పూర్తయినట్టుగా సంక్షిప్త సందేశాలను ఫోన్లకు పంపిస్తున్నారు. కోట్ల వ్యయంతో కేంద్ర ఆరోగ్య శాఖ చేపట్టిన వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని నీరుగార్చేలా జిల్లాలో ఇటువంటి మాల్ ప్రాక్టీస్ జరుగుతుండటం చర్చనీయాంశమైంది.
లక్ష్యానికి మించి టీకాలు నిజమేనా?
ఏలూరు జిల్లాలో హెల్త్కేర్ వర్కర్లు 16,134 మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోగా, బూస్టర్ డోసును 17,209 మందికి వేసినట్టు గణాంకాలు తయారు చేయడం ఎంత వరకు సమంజసమో డీఎంహెచ్వో ఇమ్యునైజేషన్ విభాగమే వివరణ ఇవ్వాలి. ఫ్రంట్లైన్ వర్కర్లు 31,666 మంది ఉండగా 33,792 మందికి ప్రికాషన్ డోసు వేయడం, ఇంకా 690 మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉందని నిర్దారణకు వచ్చేయడం సబబో, కాదో తేల్చాలి. ఇక సాధారణ ప్రజల విషయానికి వస్తే 18–59 సంవత్సరాల గ్రూపు వారిలో 13,98,259 మంది టార్గెట్ కాగా, వీరిలో 14,70,246 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ అంటే 105.05 శాతం పూర్తయి నట్టు ప్రకటించుకోవడం గమనార్హం. ఈ గ్రూపు వయ స్కుల్లో ఈ నెల 3వ తేదీ నాటికి 6,71,488 మందికి ప్రికాషనరీ డోసు వేయాలన్న లక్ష్యంలో అదేరోజునాటికి 1,55,335 మందికి (23.1శాతం) వ్యాక్సిన్ వేసినట్టు గణాంకాల్లో పేర్కొన్నారు. 60 ఏళ్ల వయసు పైబడిన సీని యర్ సిటిజన్లు జిల్లాలో 2,35,741 మంది ఉన్నట్టు గుర్తిం చగా, వీరిలో 2,48,222 మందికి (105.3 శాతం) రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందని, బూస్టర్ డోసుకు 1,77,446 మందిని ఈ నెల 8 నాటికి టార్గెట్గా పెట్టుకోగా 1,69,887 మందికి (95.7శాతం) వేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇదేపరిస్థితి 15–18 ఏల్ల గ్రూపునకు వస్తే 98,291 మందికిగాను 1,02,243 మంది (104 శాతం)కి రెండుడోసులు, 12–14 ఏళ్ళ గ్రూపులో 62,760 మందికి నూరుశాతం వ్యాక్సినేషన్ పూర్తయినట్టు పేర్కొంటున్నారు.
పాక్షిక వ్యాక్సినేషన్తో సరి
బూస్టర్ డోసు విషయంలో పలువురు ప్రికాషనరీ డోసు వేయించుకోకుండానే తమకు వ్యాక్సినేషన్ పూర్తయినట్టు ఆన్ లైన్లో ఎలా నమోదు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం కొందరు తమఫోన్లకు వచ్చిన ఎస్ఎం ఎస్లను స్పందనకు వచ్చి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడటం గమనార్హం. వ్యాక్సినేషన్కు సంబంధించి తనకు ఫిర్యాదు అందిందని డీఐవో డాక్టర్ నాగేశ్వరరావు ధ్రువీకరించారు. జిల్లాలో వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరుపై ఆరా తీయగా పలు ఆసక్తికరమైన విషయాలు విస్తుపోయేలా ఉన్నాయి. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రొటోకాల్ ప్రకారం పీహెచ్సీల వారీగా జనాభా, ఆయా గ్రూపుల లబ్ధిదారుల సంఖ్య, వారిలో రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య, వీరిలో ప్రికాషనరీ డోసుకు అవసరమైన 6 నెలల వ్యవధి పూర్తయిన వారి సంఖ్య అంటే తేదీల వారీగా బూస్టర్డోసు వేయించుకోవాల్సిన లబ్ధిదారుల పేర్లతో సహా సమగ్ర వివరాలతో కూడిన డేటాను డీఎం హెచ్వో కార్యాలయం ఇమ్యునైజేషన్ విభాగం తయారుచేయాలి. ఇలా తయారుచేసిన డేటా ప్రకారం పీహెచ్సీలకు వ్యాక్సిన్ నిల్వలను పంపించడంతోపాటు, రోజువారీ వినియోగం పోను మిగిలిన నిల్వలకు సంబంధించి రికార్డుల్లో నమోదు చేయాలి. సంబందిత రోజున బూస్టర్ డోసు వేయాల్సిన లబ్ధిదారునికి ఫోన్ ద్వారా గాని, లేదా స్థానిక ఆరోగ్య సిబ్బందితో గాని సమాచారాన్ని చేరవేసి టీకా వేయించుకున్నదీ, లేనిదీ పర్యవేక్షించాల్సిన బాధ్యత పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్తో పాటు, సిబ్బంది పైనా ఉంది. బూస్టర్డోసు వేయించుకునేం దుకు వచ్చిన వారి వివరాలను కొవిన్ పోర్టల్లో నమోదు చేసి, వ్యాక్సిన్ వేసిన తర్వాతే ఆన్లైన్ చేయాలి. ఆ తర్వాతే వ్యాక్సినేషన్ పూర్తయినట్టు సర్టిఫికెట్ వస్తుంది. దీనికి భిన్నంగా జిల్లాలో పలువురికి బూస్టర్ డోసు ముగిసినట్టు ఆన్లైన్ చేసేస్తుండటంపై సందేహాలు నెలకొన్నాయి.రోజువారీ వినియోగానికి సంబం ధించి రిపోర్టింగ్, రికార్డుల నిర్వహణ సరిగా లేకపో వడంతో పలు పీహెచ్సీల్లో వినియోగించ కుండా వున్న వ్యాక్సిన్ నిల్వలకు ఎక్స్పైరీ కూడా దగ్గర పడుతోందని సమాచారం.
సిబ్బందిని హెచ్చరించా
–డాక్టర్ నాగేశ్వరరావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి
తమకు బూస్టర్డోసు వేయకుండానే వ్యాక్సినేషన్ పూర్తయి నట్టు కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై డీఎంహెచ్వో నివేదిక కోరారు. ఆన్లైన్ జరిగిన పీహెచ్సీలకు వెళ్లి ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకున్నా. ఇకపై ఆన్లైన్ చేసే ముందు లబ్ధిదారునికి ఫోన్ చేసి నిర్దారించుకున్న తర్వాతే కొవిన్ పోర్టల్లో నమోదు చేయమని హెచ్చరించా.