ప్రభుత్వ భూమి ఆక్రమణకు యత్నం
ABN , First Publish Date - 2021-06-24T04:56:48+05:30 IST
ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు వెంటనే దానికి కబ్జా చేసేందుకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారు.
అడ్డుకున్న రెవెన్యూ అధికారులు
తర్లుపాడు, జూన్ 23: ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు వెంటనే దానికి కబ్జా చేసేందుకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారు. మండలంలోని కలుజువ్వలపాడు ఇలాకాలో సర్వే నెం.41, 36లో 70 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి జాతీయ రహదారి పక్కన ఉండటంతో ఎకరా సుమారు రూ.70 లక్షల వరకు ధర పలుకుతోంది. ప్రభుత్వ భూమి పక్కనే మార్కాపురానికి చెందిన ఒక నాయకుడు 28 ఎకరాల భూ మిని కొనుగోలు చేశాడు. దాంతోపాటు అక్కడున్న ప్రభుత్వ భూమిలో కూడా కొంత మేరకు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడు. మంగళవారం రాత్రి 2 ఎక్స్కవేటర్లతో ప్రభుత్వ భూమి ఆక్రమిస్తూ తన సొంత పొలానికి రోడ్డు వేసేందుకు చదును చేయించాడు. బుధవారం ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఆర్ఐ ఎంవీ రమణ, వీఆర్వో వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి రంగసాయి, సచివాలయ సిబ్బంది ప్రభుత్వ భూమిని పరిశీలించి ప్రభుత్వ ఆ భూమి నుంచి రోడ్డు కూడా వేసినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని తహసీల్దార్ శైలేంద్రకుమార్ దృష్టికి తీసుకెళ్లారు.
ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు
కలుజువ్వలపాడు ఇలాకాలో ప్రభుత్వ భూమిని ఒక నాయకుడు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వ భూముల్లో బోర్డులు ఏర్పాటు చేయిస్తామన్నారు. ప్రభుత్వ భూమిని ఎవరైనా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. గురువారం కలుజువ్వలాపాడులోని సర్వే నెం.41,36లో ప్రభుత్వ భూమిని కొలతలు వేయించి ఎవరైనా ఆక్రమించినట్లు తేలితే వెంటనే క్రిమనిల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
- తహసీల్దార్ శైలేంద్రకుమార్