అంగరంగ వైభంగా లష్కర్ బోనాలు

ABN , First Publish Date - 2021-07-25T20:10:57+05:30 IST

తెలంగాణలోనే అత్యంత ఘనంగా నిర్వహించే లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేలాది మంది భక్తులు అమ్మవారిని బోనం సమర్పించేందుకు తరలి వచ్చారు

అంగరంగ వైభంగా లష్కర్ బోనాలు

హైదరాబాద్: తెలంగాణలోనే అత్యంత ఘనంగా నిర్వహించే లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేలాది మంది భక్తులు అమ్మవారిని బోనం సమర్పించేందుకు తరలి వచ్చారు. పోతరాజుల వీరంగాలు, శివసత్తుల శివాలతో ఉజ్జయినీ మహాకాళి పరిసర ప్రాంతాలు మారిమోగిపోయాయి. కాగా ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనంతో తొలిబోనం, అమ్మవారికి వడిబియ్యం సమర్పించారు. ముందుగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ కు ఆలయ ఈవో మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో ఆలయ పండితులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ దంపతులను వేదపండితులు ఆశీర్వదించారు. 


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. క్యూ లైన్ లలో వచ్చే భక్తులకు త్రాగునీరు అందించేలా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకోవాలని కోరారు. మాస్క్ లు, శాని టైజర్ లను అందుబాటులో ఉంచడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, కార్పొరేటర్ సుచిత్ర తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-07-25T20:10:57+05:30 IST