పాతబస్తీలో ఘట స్థాపన ఉత్సవాలు నేడు
ABN , First Publish Date - 2021-07-25T06:32:47+05:30 IST
పాతనగర బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో
చాంద్రాయణగుట్ట, జూలై 24 (ఆంధ్రజ్యోతి): పాతనగర బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి ఘటాల ఊరేగింపు, ఘట స్థాపనకు వివిధ ఆలయాల కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. శాలిబండ కాశీవిశ్వనాథస్వామి దేవాలయం నుంచి ప్రారంభమై లాల్దర్వాజ మోడ్, లాల్దర్వాజ, బాలాగంజ్, గౌలిపురా మీదుగా ఘటాల ఊరేగింపు సాగనుంది.
ప్రత్యేక బందోబస్తు
ఘటాల ఊరేగింపు సందర్భంగా దక్షిణ మండలం పోలీసులు భారీ బం దోబస్తు ఏర్పాటు చేశారు. లాల్దర్వాజ మోడ్ వద్ద ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ మాజీ అధ్యక్షుడు దివంగత కె.ప్రకాశ్ స్మారక వేదికపై మంత్రులు, వివిధ పార్టీల నాయకులు రానుండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉజ్జయిని మహంకాళికి పట్టువస్త్రాల సమర్పణ
లంగర్హౌస్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ఆషాఢమాస బోనాల ఉత్సవాల్లో భాగంగా శనివారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి ఆలయం ట్రస్టుబోర్డు చైర్మన్ గోవింద్రాజ్, సభ్యులు సాయియాదవ్, కె.శ్రీనివాసయాదవ్, పి.శ్రీధర్, స్వరూపరాణి, ఎ.హేమలత తదితరులు అమ్మవారిని దర్శించుకుని పట్టువస్ర్తాలు సమర్పించారు.
పద్మశాలీ మేళా కమిటీ ఆధ్వర్యంలో..
రాంగోపాల్పేట్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): పద్మశాలీ మేళా కమిటీ ఆధ్వర్యంలో ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి చేనేత పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో నిష్టగా ఐదు రోజులుగా నేసిన చీరను శనివారం ఆలయ ఆర్చ్ గేట్ నుంచిమేళతాళల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత ఎల్.రమణ, తెలంగాణ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు మ్యాడం బాబురావు, మేళ అధ్యక్షులు జైరాజ్, నాగమూర్తి, సుదర్శన్రావు, హరి తదితరులు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. అంతకు ముందు ప్రజా గాయకుడు గద్దర్ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.