ఇంటింటికీ వ్యాక్సినేషన్‌తో అనేక ప్రాణాలను కాపాడగలిగేవారు : బోంబే హైకోర్టు

ABN , First Publish Date - 2021-05-12T23:31:32+05:30 IST

ప్రతి ఇంటికీ వెళ్లి వయో వృద్ధులకు కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఇచ్చి ఉంటే

ఇంటింటికీ వ్యాక్సినేషన్‌తో అనేక ప్రాణాలను కాపాడగలిగేవారు : బోంబే హైకోర్టు

ముంబై : ప్రతి ఇంటికీ వెళ్లి వయో వృద్ధులకు కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఇచ్చి ఉంటే చాలా మంది ప్రముఖులతో సహా అనేక మంది ప్రాణాలను కాపాడగలిగి ఉండేవారని బోంబే హైకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని కొంత కాలం క్రితమే చేపట్టి ఉండవలసిందని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జీఎస్ కులకర్ణి డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. 


వయోవృద్ధుల జీవితాలు ప్రమాదంలో ఉన్నపుడు, వ్యాక్సినేషన్ కేంద్రాలకు వారు వెళ్ళలేకపోతున్నపుడు, వారి ఇళ్ళకే వెళ్ళి వ్యాక్సిన్లను ఇచ్చేందుకు చురుగ్గా ఎందుకు చర్యలు చేపట్టలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇంటింటికీ వెళ్ళి వ్యాక్సినేషన్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించరాదనే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఏప్రిల్ 22న ఇచ్చిన ఆదేశాల్లో కేంద్ర ప్రభుత్వానికి సూచించిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ ఆదేశాలను పునరుద్ఘాటించింది. ఇప్పటికి మూడు వారాలు గడిచిందని, కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఇంకా తెలియజేయవలసి ఉందని పేర్కొంది. ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసిందని తెలిపింది. మే 19 నాటికి అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ మే 19న జరుగుతుందని తెలిపింది. 


75 ఏళ్ళ వయసు పైబడినవారికి, దివ్యాంగులకు, మంచానికే పరిమితమైనవారికి, వీల్‌చైర్‌లోనే ఉండేవారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఇంటింటికీ వెళ్ళే విధంగా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ధ్రుతి కపాడియా, కుణాల్ తివారీ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. 


Updated Date - 2021-05-12T23:31:32+05:30 IST