Deadly Gas : పక్కా ప్లాన్తో తల్లీ, ఇద్దరు కూతుళ్ల ఆత్మహత్య.. ఎలా చనిపోయారో తెలుసా..
ABN , First Publish Date - 2022-05-22T23:31:20+05:30 IST
విషపూరితమైన వాయువుతో కూడిన ఓ ప్లాట్లో 3 మృతదేహాలు.. ఒకరు 50 ఏళ్ల మహిళ కాగా మిగతా ఇద్దరు ఆమె కుమార్తెలు.. అదే ప్లాట్లో వెన్నులో వణుకుపుట్టించే సూసైడ్ ఓ నోట్..
న్యూఢిల్లీ : విషపూరితమైన వాయువుతో కూడిన ఓ ప్లాట్లో 3 మృతదేహాలు.. ఒకరు 50 ఏళ్ల మహిళ కాగా మిగతా ఇద్దరు ఆమె కుమార్తెలు.. అదే ప్లాట్లో వెన్నులో వణుకుపుట్టించే ఓ నోట్ సూసైడ్ .. ఇవీ దక్షిణ ఢిల్లీలో ఆదివారం వెలుగుచూసిన ఓ ‘ట్రిపుల్ సూసైడ్’ ఘటనలో విస్తుపోయే అంశాలు. నగరంలో పోష్ వసంత్ విహార్లోని ఓ ప్లాట్లో తల్లి, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్యకు వేసిన పక్కా ప్లాన్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఫ్లాట్లోకి గాలి ప్రవేశించే తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లు అన్నింటినీ రేకు లాంటి ఓ పదార్థంతో పూర్తిగా మూసివేశారు. గాలి చొరబాటుకు ఏమాత్రం అవకాశం లేకుండా రేకును గోడకు అంటిస్తూ ప్లాస్టర్ కూడా అతికించారు. ఈ విధంగా గాలి ప్రవేశాన్ని నిరోధించడమే కాకుండా తమను ఎవరూ పసిగట్టకుండా ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ మెటీరియల్ అంతటినీ ఆన్లైన్లో ఆర్డర్ చేశారు. ఇక ప్లాన్ ప్రకారం.. గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ను ఆన్ చేశారు. ఆ తర్వాత బొగ్గుల కుంపటి రగులుతూ ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి వెంటిలేషన్ లేని ఆ గదిలో బొగ్గు కలుతూ ఉండడంతో విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడి గదంతా వ్యాపించింది. ఊపిరాడక వారు ముగ్గురూ విలవిల్లాడుతూ చనిపోయారు. విషపు గ్యాస్ కారణంగానే వారు ముగ్గురూ చనిపోయారని పోలీసులు వెల్లడించారు. ముగ్గురి మృతదేహాలు ఒకే రూంలో ఉన్నాయని, వారి పక్కనే బొగ్గుల కుంపటి ఉందని చెప్పారు. ఫ్లాట్లో పనిచేసేవారు, పొరుగు ఫ్లాట్ల సభ్యులు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నామని పోలీసులు తెలిపారు.
లోపలికి ప్రవేశించేవారికి ఓ లెటర్..
ఆత్మహత్యకు పాల్పడిన ఫ్లాట్లో సూసైడ్ నోట్లు లభ్యమయ్యాయి. అందులోని ఒక నోట్లో ఫ్లాట్లోకి ప్రవేశించాలనుకునే వ్యక్తులకు సూచనలు చేశారు. ఫ్లాట్లోకి ప్రవేశించేవారు అగ్గిపెట్టె లేదా కొవ్వొత్తిని అస్సలు వెలిగించొద్దని సూచించారు. వెలిగిస్తే మంటలు దహించివేస్తాయని హెచ్చరించారు. ఫ్లాట్ అంతా ప్రాణాంతకమైన కార్బన్ మోనాక్సైడ్తో నిండిపోయి ఉంది. ఈ గ్యాస్ మండిపోగలదు. దయచేసి కిటికీలు, తలుపులు తెరచి వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి. కర్టెయిన్లు తొలగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అంతా విషపూరితమైన గ్యాస్ నిండి ఉంది. ఈ వాయువుని పీల్చకండి.. అని ఇంగ్లీష్లో సూసైడ్ నోట్ రాశారు.
కాగా 50 ఏళ్ల మహిళను మంజూ శ్రీవాస్తవగా, మిగతా ఇద్దరూ ఆమె కూతుళ్లు అన్షికా, అంకూగా గుర్తించినట్టు పోలీసులు వివరించారు. వారి ఫ్లాట్లో పనిచేసేవారు, పొరుగువారు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా మంజూ శ్రీవాస్తవ భర్త చంద్ర శ్రీవాస్తవ గతేడాది కొవిడ్తో చనిపోయాడు. అప్పటి నుంచి ఆ కుటుంబం తేరుకోలేదు. ఈ క్రమంలో భార్య మంజూ ఆరోగ్యం కూడా క్షీణించింది. మంచానికే పరిమితమవ్వాల్సి వచ్చిందని తెలిసిందని పోలీసలు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి విస్తృత దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.