తీరం చేరిన మరబోట్లు
ABN , First Publish Date - 2020-06-07T08:10:26+05:30 IST
వేట పునఃప్రారంభం తర్వాత తొలిసారి సముద్రంలోకి వెళ్లిన మరబోట్లలో కొన్ని శనివారం తీరానికి చేరడంతో
అత్యధిక బోట్ల వలలకు చిక్కిన రొయ్యలు
కానీ ఎగుమతిదారులు కొనక ఇబ్బందులు
వన్టౌన్, జూన్ 6: వేట పునఃప్రారంభం తర్వాత తొలిసారి సముద్రంలోకి వెళ్లిన మరబోట్లలో కొన్ని శనివారం తీరానికి చేరడంతో ఫిషింగ్ హార్బర్లో సందడి నెలకొంది. చాలాబోట్లు తీరానికి చేరగా, ఎప్పటిలాగే ఈ సీజన్లో రొయ్యిలు వలకు చిక్కాయి. వాస్తవానికి సముద్రంలోకి వేటకు వెళ్లిన బోట్లు రెండు వారాల నుంచి నాలుగు వారాలపాటు సముద్రంలో వేట సాగించి తిరుగు ప్రయాణం అవుతాయి. కానీ ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా మత్స్యకారులు తమవద్ద ఉన్న కొద్దిపాటి వనరులతో ఆయిల్, ఐస్ కొనుగోలుచేసి వేటకు వెళ్లారు. దీంతో రెండు మూడు రోజులకే వేట ముగించుకుని తిరిగి తీరానికి చేరాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి వల్ల బోటు యజమానులు పెద్దగా లాభాలు కళ్లజూసే అవకాశం లేదని హార్బర్ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు మత్స్యకారులు తీసుకువచ్చిన రొయ్యిలను ఎగుమతి కంపెనీలు కొనుగోలు చేయడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఐస్ కొరత కారణంగా వందలాది బోట్లు తీరానికే పరిమితమయ్యాయి. ఒక్కోబోటు పూర్తిస్థాయిలో వేట జరపాలంటే అవసరమైన ఆయిల్, ఐస్, నిత్యావసర సరుకులకు రూ.3 లక్షల నుండి రూ.4 లక్షలు పెట్టుబడి పెట్టాలి. అయితే ఆర్థిక ఇబ్బందులు, ఐస్ కొరత కారణంగా చాలాబోట్లు లంగరుకే పరిమితమయ్యాయి.