నెత్తురోడిన పత్తి చేను !
ABN , First Publish Date - 2021-06-20T09:25:17+05:30 IST
రక్త సంబంధం మంట కలిసింది... పత్తి చేను రక్తమోడింది... అనుబంధాలు గాలిలో కలిశాయి. అన్నదమ్ముల కుటుంబాల మధ్య నెలకొన్న భూ తగాదాలు ముగ్గురి నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
- భూ తగాదాలతో ముగ్గురి దారుణహత్య
- అన్న కుటుంబంపై గొడ్లళ్లతో తమ్ముడి దాడి
- ఘటనలో తండ్రి, ఇద్దరు కుమారుల మృతి
- భూపాలపల్లి జిల్లాలో అమానుష ఘటన
కాటారం, జూన్ 19: రక్త సంబంధం మంట కలిసింది... పత్తి చేను రక్తమోడింది... అనుబంధాలు గాలిలో కలిశాయి. అన్నదమ్ముల కుటుంబాల మధ్య నెలకొన్న భూ తగాదాలు ముగ్గురి నిండు ప్రాణాలను బలిగొన్నాయి. భూ తగాదాల నేపథ్యంలో తండ్రి, ఇద్దరు కొడుకులను రక్తసంబంధీకులే గొడ్డళ్లతో దారుణంగా నరికి చంపారు. ఈ హత్యాకాండ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని గంగారంలో శనివారం జరిగింది. గంగారానికి చెందిన లావుడ్యా చక్రియా నాయక్కు మంజా నాయక్ (68), రమ్జా నాయక్, సమ్మయ్య నాయక్, మహంకాళి నాయక్ కుమారులు. వీరిలో రమ్జా నాయక్ గతంలోనే మృతి చెందాడు. మంజా నాయక్కు సారయ్య(45), భాస్కర్ (38), సమ్మయ్యలు కుమారులు. మంజానాయక్ విలాసాగర్ శివారులో సుమారు 20 ఎకరాల భూమిని 15 ఏళ్ల క్రితం కొనుగోలు చేశాడు. పక్కనే ఇతరుల పేరున ఉన్న సుమారు 13 గుంటల ఇనాం భూమిని సైతం సాగు చేస్తున్నాడు.
ఈ క్రమంలో మంజా నాయక్ సోదరులు సమ్మయ్య నాయక్, మహంకాళి నాయక్ ఈ ఇనాం భూమిలో తమకు కూడా వాటా ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై కోర్టుకు కూడా వెళ్లారు. ఈ గొడవలు కొనసాగుతుండగానే మంజానాయక్.. ఇనాం భూమి పట్టాదారుతో మాట్లాడుకొని 13 గుంటల భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అప్పటి నుంచి ఆ భూమి తన సొంతమని, ఎవరికీ వాటా ఉండదని స్పష్టం చేస్తూ వస్తున్నాడు. ఇది జీర్ణించుకోలేని ఇద్దరు సోదరులు.. మంజానాయక్కు చెందిన మొత్తం 20 ఎకరాల 13 గుంటల్లో తమకు తప్పకుండా హక్కు ఉంటుందని, ఒకే కుటుంబానికి చెందిన వాళ్లం గనుక తమకు వాటా ఇవ్వాలని పట్టుబడుతూ వస్తున్నారు. గత పదేళ్లుగా ఈ గొడవ కొనసాగుతోంది.
ఈ క్రమంలో శనివారం మంజా నాయక్, ఆయన కుమారులు సారయ్య, సమ్మయ్య, భాస్కర్, కోడలు సునీత, మనువడు చేను వద్దకు వెళ్లి పత్తి గింజలు నాటడం మొదలెట్టారు. ఈ విషయం మంజానాయక్ సోదరుల్లో ఒకరైన మహంకాళి నాయక్కు తెలిసింది. వెంటనే అతడు తన కుటుంబ సభ్యులు కౌసల్య, సర్దార్, బాపు ఇతర బంధువులతో అక్కడికి చేరుకున్నాడు. గింజలు నాటవద్దంటూ గొడవకు దిగారు. మాటామాటా పెరగడంతో మహంకాళి నాయక్ తరఫు వారు కారం పొడిని కళ్లల్లో చల్లి మంజా నాయక్తో పాటు అతడి కుమారులు సారయ్య, భాస్కర్పై గొడ్డళ్లతో దాడి చేసి, ముగ్గురి గొంతులను నరకడంతో వారు మృతిచెందారు. మంజానాయక్ మరో కుమారుడు సమ్మయ్య గాయాలతో తప్పించుకున్నాడు. కోడలు సునీత (మృతుడు భాస్కర్ భార్య) గాయపడింది. నిందితుల్లో ముగ్గురు పోలీ్సస్టేషన్లో లొంగిపోయినట్టు సమాచారం.