కాబూల్ పాఠశాలలో పేలుళ్లు... నలుగురి మృతి, 14 మందికి గాయాలు...
ABN , First Publish Date - 2022-04-19T19:22:52+05:30 IST
ఆఫ్ఘనిస్థాన్లోని పశ్చిమ కాబూల్లో మూడు పేలుళ్ళు బీభత్సం సృష్టించాయి
కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్లోని పశ్చిమ కాబూల్లో మూడు పేలుళ్ళు బీభత్సం సృష్టించాయి. ఓ హైస్కూలులో జరిగిన ఈ పేలుళ్ళలో దాదాపు నలుగురు ప్రాణాలు కోల్పోయారు, సుమారు 14 మంది గాయపడ్డారు. ఈ పాఠశాల పరిసరాల్లో కొందరు షియా హజరా తెగకు చెందినవారు ఉన్నారు. వీరు మతపరమైన అల్పసంఖ్యాకులు. వీరిపై సున్నీ ఉగ్రవాద సంస్థలు తరచూ దాడులు చేస్తూ ఉంటాయి.
కాబూల్ కమాండర్ అధికార ప్రతినిధి ఖలీద్ జడ్రాన్ మాట్లాడుతూ, ఓ హైస్కూలులో మూడు పేలుళ్ళు జరిగాయని చెప్పారు. షియా ప్రజలు కొందరు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. క్షతగాత్రులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రి నర్సింగ్ డిపార్ట్మెంట్ అధిపతి మాట్లాడుతూ, ఈ పేలుళ్లలో సుమారు నలుగురు ప్రాణాలు కోల్పోయారని, దాదాపు 14 మంది గాయపడ్డారని తెలిపారు.
ఇదిలావుండగా, ఈ దాడికి తమదే బాధ్యత అని ఇప్పటి వరకు ఏ సంస్థా ప్రకటించలేదు. అయితే తాము అధికారం చేపట్టినప్పటి నుంచి ఆఫ్ఘనిస్థాన్ భద్రతను పరిరక్షిస్తున్నామని తాలిబన్లు చెప్తున్నారు. కానీ అంతర్జాతీయ సంస్థలు, విశ్లేషకులు మాత్రం ఉగ్రవాద సంస్థల్లో తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. మరోవైపు అనేక దాడులకు తమదే బాధ్యత అని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.