నేతాజీ చరిత్రపై నిందలు
ABN , First Publish Date - 2021-03-03T06:04:39+05:30 IST
కొప్పర్తి వెంకట రమణమూర్తి ఆంధ్రజ్యోతిలో జనవరి 31న రాసిన వ్యాసంలో ‘విఫల ప్రత్యామ్నాయం బోస్’ అనడం చరిత్ర తెలియక పోవడమే...
కొప్పర్తి వెంకట రమణమూర్తి ఆంధ్రజ్యోతిలో జనవరి 31న రాసిన వ్యాసంలో ‘విఫల ప్రత్యామ్నాయం బోస్’ అనడం చరిత్ర తెలియక పోవడమే. భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చిన బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ తదనంతరం ‘‘గాంధీ, కాంగ్రెస్లకి భయపడి కాదు, కేవలం నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటానికి భయపడే భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చాం’’ అని 1957లో స్వయంగా చెప్పారు. నేతాజీ చరిత్ర మొత్తానికి ఈ ఒక్క సర్టిఫికెట్ చాలదా?
హిట్లర్, ముస్సోలినీ వైపు నేతాజీ చేరడం నేరంగా కొప్పర్తి వాదించారు. రష్యా అధినేత ఈ దుర్మార్గులతో ఒప్పందాలతో పక్క దేశాల్ని పంచుకున్నాడు. దీనిని ఏమనాలి? అమెరికా మొదట హిట్లర్కి ఆయుధాలు అమ్మింది. బ్రిటన్ సహకారం ఇచ్చింది. అనంతర కాలంలో హిట్లర్ తమని ఎక్కడ హతమారుస్తాడో అన్న ప్రమాదం వచ్చాకనే పెట్టుబడిదారీ అమెరికా, బ్రిటన్లూ కమ్యూనిస్టు రష్యా ఏకమయ్యాయి. ఆయా పరిస్థితులను బట్టి పాత వైరాలు, పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు పక్కకునెట్టి హిట్లర్పై యుద్ధం చేశాయి. ఇది చరిత్ర. పరిస్థితులు ఈ దేశాల్ని అవసరం రీత్యా మార్పు చెందేట్టు చేశాయి.
జపాన్ నియంతలతో నేతాజీ కలవడం దేశద్రోహం అన్నారు కొప్పర్తి. సరే, బ్రిటిష్వారు భారత్ని 200 సంవత్సరాల పాటు పాలించారు. వీరిపై గాంధీ, కాంగ్రెస్ మొదలైన బృందాలు పోరాడాయి. కాని రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్కి సహాయం చేయాలని గాంధీ అనడం ఏం నీతి? దీనిని ఖండించిన నేతాజీ చరిత్రహీనుడా? ఇది నిప్పుకు చెదపట్టే వాదన కాదా?
నేతాజీ ప్రత్యేక ప్రభుత్వం స్థాపించారు. అండమాన్స్ను విడుదల చేశారు. భారత స్వాతంత్ర పతాక ఎగురవేశారు. కేబినెట్ స్థాపించారు. భారతదేశానికి స్వాతంత్య్రం కోసం 1945లోనే నేతాజీ మొక్క నాటారు. తొలి భారత ప్రధాని నేతాజీ. ఇది చరిత్ర. స్వార్థశక్తులు ఆయన అమేయ చరిత్రని సమాధి చేశాయి.
ఈ దేశం కోసం ఎందరో రక్తతర్పణలు, త్యాగాలు చేశారు. కాని జరిగిందేమిటి? కేవలం గాంధీ–నెహ్రూ–కాంగ్రెస్ స్వాతంత్య్ర కారకులని చరిత్ర వక్రీకరణ జరిగింది.
మంగెన గంగాధరరావు