ఆరోగ్య శ్రీ పరిధిలోకి బ్లాక్ ఫంగస్: మంత్రి ఆళ్లనాని

ABN , First Publish Date - 2021-05-17T19:30:20+05:30 IST

కర్ఫ్యూ వల్ల కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని అన్నారు.

ఆరోగ్య శ్రీ పరిధిలోకి బ్లాక్ ఫంగస్: మంత్రి ఆళ్లనాని

అమరావతి:  కర్ఫ్యూ వల్ల కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగించాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. ఉదయం  6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని తెలిపారు. నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి  ఆరోగ్య శ్రీ పరిధిలో చికిత్స చేయాలని సీఎం ఆదేశించారన్నారు. పాజిటివ్ పేషంట్ల గుర్తింపు కోసం ఫీవర్ సర్వే చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మరింత  పకడ్బంధీగా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామన్నారు. సర్వేలో గుర్తించిన వారిలో అవసరమైన వారిని ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తామని మంత్రి ఆళ్లనాని చెప్పారు.


కొవిడ్ కారణంగా  తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు అనాథలైన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి ఆళ్లనాని  తెలిపారు.  పదివేల ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు. ఈనెలాఖరు కల్లా  2వేలకు పైగా ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ రాబోతున్నాయని ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు  9 బ్లాక్ ఫంగస్  కేసులు నమోదయ్యాయని మంత్రి ఆళ్లనాని  తెలిపారు. బ్లాక్ ఫంగస్ కేసులను వెంటనే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారన్నారు. బ్లాక్ ఫంగస్ నివారణకు వాడే మందులను సమకూర్చాలని సీఎం ఆదేశించారని  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2021-05-17T19:30:20+05:30 IST