రాష్ట్రంలో అరాచక పాలన
ABN , First Publish Date - 2022-08-11T07:10:32+05:30 IST
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కేతినేని సురేంద్రమోహన్ అన్నారు. బీజేపీ యువమోర్చా మోటార్ సైకిళ్ల ర్యాలీ బుధవారం మండపేటకు చేరుకుంది. వైసీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు కర్రి చిట్టిబాబు, మండపేట నియోజకవర్గ ఇన్చార్జి కోన సత్యనారాయణ, గొడవర్తి రామచంద్రరావు, నాయకులు స్వాగతం పలికారు.
బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్
మండపేట, ఆగస్టు 10: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కేతినేని సురేంద్రమోహన్ అన్నారు. బీజేపీ యువమోర్చా మోటార్ సైకిళ్ల ర్యాలీ బుధవారం మండపేటకు చేరుకుంది. వైసీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు కర్రి చిట్టిబాబు, మండపేట నియోజకవర్గ ఇన్చార్జి కోన సత్యనారాయణ, గొడవర్తి రామచంద్రరావు, నాయకులు స్వాగతం పలికారు. అనంతరం కలువపువ్వు సెంటర్లో సురేంద్రకుమార్ మాట్లాడుతూ ఏపీలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయన్నారు. ఇసుక, మద్యం, రియల్ ఎస్టేట్ ఆదాయ వనరులపైనే వైసీపీ నేతలు దృష్టి సారించారన్నారు. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం హైజాక్ చేసి ప్రచారం చేసుకుంటోందన్నారు. ప్రధాన పట్టణాల్లో బార్లు తెరిచి పబ్ కల్చర్కు అనుమతి ఇవ్వడంతో యువత పెడదోవ పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. జ్యోతిబాపూలే విగ్రహానికి మోహన్ పూలమాల వేసి నివాళులర్పించారు. బీజేపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు కర్రి చిట్టిబాబు మాట్లాడుతూ మండపేట-ద్వారపూడి రోడ్డు నిర్మాణానికి కేంద్రం రూ.25 కోట్లు మంజూరు చేసినా ఇప్పటికీ పనులు చేపట్టలేదన్నారు. అధికారంలో ఉన్న వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీ కరచాలనం కోసం పోటీపడుతున్నారని అన్నారు. ర్యాలీలో బీజేపీ నాయకులు నల్లా పవన్కుమార్, సాయి, కార్యకర్తలు బీజేవైఎం సభ్యులు పాల్గొన్నారు.