మమతా బెనర్జీతో ప్రియాంక ఢీ... నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి

ABN , First Publish Date - 2021-09-13T23:31:29+05:30 IST

బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై పోటీకి సిద్ధమైన ప్రియాంక టిబ్రేవాల్ సోమవారం తన నామినేషన్ దాఖలు చేశారు. వృత్తిరిత్యా న్యాయవాది అయిన ఆమె బీజేపీ టికెట్‌పై భవానీపూర్ నియోజక వర్గం నుంచీ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నారు.

మమతా బెనర్జీతో ప్రియాంక ఢీ... నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి

బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై పోటీకి సిద్ధమైన ప్రియాంక టిబ్రేవాల్ సోమవారం తన నామినేషన్ దాఖలు చేశారు. వృత్తిరిత్యా న్యాయవాది అయిన ఆమె బీజేపీ టికెట్‌పై భవానీపూర్ నియోజక వర్గం నుంచీ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నారు. 

ఈ నెల 30న భవానీపూర్‌లో పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 3న ఫలితాలు వెలువడతాయి. మమతా బెనర్జీకి బాగా పట్టున్న ఈ నియోజక వర్గంలో సీపీఎం తరుఫున శ్రీజిబ్ బిస్వాస్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికకు దూరంగా ఉండిపోవాలని నిర్ణయించింది.

బెంగాల్లో గత కొంత కాలంగా మారిన రాజకీయ ముఖచిత్రం కారణంగా, భవానీపూర్‌లో పోటీ ప్రధానంగా టీఎంసీ, బీజేపీల మధ్యనే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి మమత అవలీలగా గెలిచే సూచనలే కనిపిస్తున్నాయి. అయినా ఈ ఉప ఎన్నికని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ, ప్రియాంక టిబ్రేవాల్‌ను, బరిలోకి దింపింది. ఆమె అలీపూర్‌లో నామినేషన్ వేశారు. ప్రియాంకతో పాటూ నామినేషన్ సమయంలో... బెంగాల్ బీజేపీ నాయకులు సువేందు అధికారి, అర్జున్ సింగ్ కూడా ఉన్నారు.   

బెంగాల్‌ అసెంబ్లీకి జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో భవానీపూర్ నుంచీ టీఎంసీ నేత సోవన్‌దేబ్ ఛటోపాధ్యాయ గెలుపొందారు. కానీ, నందిగ్రామ్ నుంచీ సువేందు అధికారిపై పోటీ చేసిన మమతా బెనర్జీ ఓడిపోవటంతో తన భవానీపూర్ సీటుకి సోవన్‌దేబ్ రాజీనామా చేశారు. దాంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

నవంబర్ 5 లోపు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలవాల్సి ఉంది. లేదంటే ఆమె ముఖ్యమంత్రి పదవి వదులుకోవాల్సి వస్తుంది. భవానీపూర్ నుంచీ పలుమార్లు గెలిచిన ఆమె అక్టోబర్ 3న మళ్లీ విజయం సాధించటం ఆశ్చర్యమేం కాదు. అయితే, బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ ఎంత గట్టి పోటి ఇస్తారని మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. 


Updated Date - 2021-09-13T23:31:29+05:30 IST