సచిన్-సెహ్వాగ్‌లాగే మా జోడీ సూపర్ హిట్ : రాజ్‌నాథ్

ABN , First Publish Date - 2020-10-22T00:36:08+05:30 IST

బీహార్‌లోని సంకీర్ణ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిపై ఎవరైనా చర్చించ వచ్చని, కానీ అవినీతిపై నితీష్ కుమార్‌ను మాత్రం ఏ ఒక్కరూ వేలెత్తి..

సచిన్-సెహ్వాగ్‌లాగే మా జోడీ సూపర్ హిట్ : రాజ్‌నాథ్

భాగల్‌పూర్: భారత్ క్రికెట్‌ ఓపెనింగ్ పెయిర్‌గా ఎన్నో సంచలనాలు సృష్టించిన సచిన్-సెహ్వాగ్ జోడీని, బీహార్‌లోని బీజేపీ-జేడీయూ జోడీతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పోల్చారు. భారత క్రికెట్ ఓపినింగ్ పెయిర్ సచిన్-సెహ్లాగ్‌ తరహాలోనే తమ రెండు పార్టీలది 'సూపర్‌హిట్' జోడీ అని అభివర్ణించారు. బీహార్‌లోని సంకీర్ణ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిపై ఎవరైనా చర్చించ వచ్చని, కానీ అవినీతిపై నితీష్ కుమార్‌ను మాత్రం ఏ ఒక్కరూ వేలెత్తి చూపించలేరని అన్నారు. ఈనెల 28న బీహార్ అసెంబ్లీకి తొలి విడత ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో భాగల్‌‌పూర్‌లో జిల్లాలో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు.


ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి-బీజేపీ నేత సుశీల్ మోదీలపై రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు కురిపిచారు. వారిపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని చెప్పారు. స్థానిక భోజ్‌పురి భాషలో ఆయన మాట్లాడుతూ..'లాంతరు చిట్లింది. కిరోసిన్ కారిపోయింది. ఇప్పుడు ఏమాత్రం పనిచేయడం లేదు' అని ఆర్జేడీపై చతురోక్తులు విసిరారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన వంటి వివిధ సంక్షేమ పథకాలను కూడా రాజ్‌నాథ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.


విపక్ష ఆర్జేడీపై రాజ్‌నాథ్ ఈ సందర్భంగా విమర్శలు గుప్పిస్తూ, ప్రజలు ఆర్జేడీ 15 ఏళ్ల పాలనను చూశారని, ఆర్జేడీ అవకతవకల పాలనకూ, నితీష్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అందించిన సుపరిపాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వారు గమనించ వచ్చని అన్నారు. బీజేపీ-జేడీయూ కూటమి ప్రభుత్వం విద్యుత్, రోడ్లు, నీళ్లు వంటి కనీస సౌకర్యాలను ప్రజలందిరికీ కల్పించిందన్నారు. దశాబ్దాలుగా బీహార్ ప్రజలు వీటికి నోచుకేలేదని అన్నారు. '15 ఏళ్ల లాంతర్ (ఆర్జేడీ గుర్తు) పాలనను ప్రజలు చూశారు. బీజేపీ-జేడీయూ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధినీ చూశారు. రెండు ప్రభుత్వాల పనితీరును ఏమాత్రం పోల్చలేం. రాష్ట్రం రూపురేఖలు ఎన్డీయే ప్రభుత్వం సమూలంగా మార్చేసింది' అని సింగ్ తెలిపారు.


బీహార్ సాహస జవాన్లకు ధన్యవాదాలు..

తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘటనలో అమరులైన బీహార్ రెజిమెంట్ సైనికుల త్యాగనిరతని రాజ్‌నాథ్ కొనియాడారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సాహసవీరులను అందించిన బీహార్ ప్రజలకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.

Updated Date - 2020-10-22T00:36:08+05:30 IST