గుజరాత్ జిల్లా పంచాయతీలన్నీ బీజేపీ ఖాతాలోనే

ABN , First Publish Date - 2021-03-03T02:08:23+05:30 IST

గుజరాత్ జిల్లా పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం

గుజరాత్ జిల్లా పంచాయతీలన్నీ బీజేపీ ఖాతాలోనే

న్యూఢిల్లీ : గుజరాత్ జిల్లా పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ సహా ఇతర పక్షాలన్నిటినీ తుడిచిపెట్టి, తనకు ఎదురే లేదని నిరూపించింది. మొత్తం 31 జిల్లా పంచాయతీలకు ఎన్నికలు జరగగా, అన్నిటిలోనూ ఆ పార్టీ జయకేతనం ఎగురవేసింది. 


గుజరాత్‌లోని 81 మునిసిపాలిటీలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలూకా పంచాయతీలకు ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఓట్ల లెక్కింపు మంగళవారం జరిగింది. మంగళవారం రాత్రి 7 గంటలకు అందిన సమాచారం ప్రకారం, బీజేపీ 31 జిల్లా పంచాయతీల్లో విజయం సాధించింది. 2015లో జరిగిన ఎన్నికల్లో ఏడు జిల్లా పంచాయతీలను  కాంగ్రెస్‌ గెలుచుకోగా, రెండిటిలో ఇతరులు గెలిచారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ సహా ఇతర పక్షాలన్నీ పరాజయాన్ని ఎదుర్కొన్నాయి. పంచమహల్ జిల్లాలో కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేకపోయింది. కాంగ్రెస్ కనీసం 10 మంది అభ్యర్థులను గెలిపించుకోలేకపోయిన జిల్లాలు 29 ఉన్నాయి. 


ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ ట్వీట్‌లో గుజరాతీలకు ధన్యవాదాలు తెలిపారు. గుజరాత్‌లో నగర పాలక సంస్థలు, తాలూకా పంచాయతీలు, జిల్లా పంచాయతీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు సుస్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. అభివృద్ధి, సుపరిపాలన ఎజెండాతో పని చేస్తున్న బీజేపీతోనే తాము ఉన్నామని గుజరాతీలు స్పష్టం చేశారన్నారు. బీజేపీకే తమ మద్దతు అని గుజరాతీలు గట్టిగా చెప్పారన్నారు. బీజేపీ పట్ల దృఢమైన నమ్మకాన్ని, అభిమానాన్ని ప్రదర్శిస్తున్న గుజరాతీలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. 


బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా గుజరాతీలకు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి, నమ్మకాలకు నిదర్శనంగా నిలిచే బీజేపీ పట్ల నమ్మకం ప్రదర్శించిన గుజరాతీలకు ధన్యవాదాలు చెప్తున్నానని తెలిపారు. 


Updated Date - 2021-03-03T02:08:23+05:30 IST