Manipur తొలి దశ పోలింగ్‌లో 30 సీట్లు గెల్చుకుంటాం...సీఎం ఎన్ బీరెన్‌సింగ్ ధీమా

ABN , First Publish Date - 2022-02-28T16:20:59+05:30 IST

మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 38 స్థానాలకు గాను 30 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ జోస్యం చెప్పారు....

Manipur తొలి దశ పోలింగ్‌లో 30 సీట్లు గెల్చుకుంటాం...సీఎం ఎన్ బీరెన్‌సింగ్ ధీమా

ఇంఫాల్ : మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 38 స్థానాలకు గాను 30 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ జోస్యం చెప్పారు.మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఇంఫాల్‌లోని శ్రీవాన్ హైస్కూల్‌లో సోమవారం ఓటు వేశారు.బీరెన్ సింగ్ తన సొంత స్థానమైన ఇంఫాల్ ఈస్ట్‌లోని హీంగాంగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఓటు వేసిన అనంతరం బీరెన్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ‘‘మణిపూర్ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీని ఇష్టపడుతున్నారు’’అని సింగ్ అన్నారు.‘‘రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్య శక్తిని ప్రజలు వినియోగించుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను.’’ అని సింగ్ అన్నారు. 


ఓటు వేయడానికి ముందు ముఖ్యమంత్రి స్థానిక ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్, చురచంద్‌పూర్, కాంగ్‌పోక్పితో సహా ఐదు జిల్లాల్లోని 38 నియోజకవర్గాల్లో మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ సోమవారం ప్రారంభమైంది.సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. కొవిడ్ పాజిటివ్ లేదా క్వారంటైన్‌లో ఉన్న ఓటర్లు చివరి గంటలో అంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు వేయడానికి అనుమతించనున్నారు. సోమవారం జరిగిన పోల్‌లో 173 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.


Updated Date - 2022-02-28T16:20:59+05:30 IST