కరెంటు మీటరుకూ.. ఎమ్మెల్యేను కలవాలా?

ABN , First Publish Date - 2021-02-26T08:04:30+05:30 IST

జగన్‌ ప్రభుత్వంలో కరెంట్‌ మీటర్‌ కావాలన్నా ఎమ్మెల్యేలను కలవాల్సిన దుస్థితి నెలకొందని, బీజేపీ జనసేన కూటమికి అధికారమిచ్చిన స్థానిక సంస్థల్లో ఆ పరిస్థితులు ఉండనివ్వమని...

కరెంటు మీటరుకూ.. ఎమ్మెల్యేను కలవాలా?

  • బీజేపీ గెలిస్తే లంచాల సంస్కృతి ఉండదు: కన్నా 


గుంటూరు (సంగడిగుంట), ఫిబ్రవరి 25: జగన్‌ ప్రభుత్వంలో కరెంట్‌ మీటర్‌ కావాలన్నా ఎమ్మెల్యేలను కలవాల్సిన దుస్థితి నెలకొందని, బీజేపీ జనసేన కూటమికి అధికారమిచ్చిన స్థానిక సంస్థల్లో ఆ పరిస్థితులు ఉండనివ్వమని బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులోని పలు డివిజన్లలో గురువారం బీజేపీ, జనసేన పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుంటూరులో  బీజేపీ జనసేన కూటమికి అధికారమిస్తే ఎమ్మెల్యేలకు లంచాల సంస్కృతిని లేకుండా చేస్తామన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఇంటి నిర్మాణ అనుమతులకూ ఎమ్మెల్యేలను కలవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రాంతీయ పార్టీలు చాక్లెట్‌ ఇచ్చి నక్లెస్‌ దోచుకుంటున్నాయని ఆ పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలని కన్నా కోరారు. గుంటూరు నగరంలో జరిగే ప్రతి అభివృద్ధి కేంద్రం నిధులతోనే జరుగుతోందని తెలిపారు. కేంద్రం నిధులిచ్చినా  ప్రభుత్వ అలసత్వం వల్ల అండర్‌ డ్రైనేజ్‌ ఏర్పాటు చేసుకోలేకపోయామన్నారు. బీజేపీ గెలిస్తే పెంచిన ఇంటి పన్నులను అమలు చేయబోమన్నారు. పంచాయతీల్లో ఏకగ్రీవాలన్నీ వైసీపీ దౌర్జన్యాలతో జరిగినవే తప్ప.. ప్రజాస్వామ్య బద్ధంగా జరగినవి కాదని కన్నా ఆక్షేపించారు.


Updated Date - 2021-02-26T08:04:30+05:30 IST