2024 Lok Sabha Elections: బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం : మమత బెనర్జీ
ABN , First Publish Date - 2022-07-21T23:22:02+05:30 IST
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ
కోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ (Mamata Banerjee) గురువారం భారతీయ జనతా పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రజా తీర్పుతో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందన్నారు. అమరవీరుల సంస్మరణ దినం (Martyr's Day) సభలో ఆమె మాట్లాడుతూ, బీజేపీకి వ్యతిరేకంగా విద్యార్థులు, యువతతో ఢిల్లీకి ఓ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు.
అన్ని చోట్ల ప్రభుత్వాలను కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ (West Bengal)లో తమను ఓడించేందుకు ప్రయత్నించిందని, కానీ విజయం సాధించలేకపోయిందని చెప్పారు. ఉత్తర ప్రదేశ్, బిహార్, గోవా (Goa), త్రిపుర (Tripura) వంటి రాష్ట్రాల్లో టీఎంసీ గెలుపు కోసం కృషి చేయాలని ఆ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh), బిహార్ (Bihar)లలో ఇతర పార్టీలతో కలిసి పని చేస్తామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం వివిధ ఆహార ఉత్పత్తులపై జీఎస్టీ (Goods and Services Tax) విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పఫ్డ్ రైస్పై కూడా జీఎస్టీ విధించారని, బీజేపీవాళ్ళు దానిని తినరా? అని ప్రశ్నించారు. స్వీట్లు, లస్సీ, పెరుగులపై కూడా జీఎస్టీ విధించడం దారుణమని, ప్రజలు ఏం తింటారని నిలదీశారు.
పశ్చిమ బెంగాల్కు రావలసిన నిధులను తక్షణమే విడుదల చేయకపోతే ఢిల్లీలో బీజేపీ పెద్దలను ఘెరావ్ చేస్తామని హెచ్చరించారు. స్వాతంత్ర్యోద్యమంలో ఎటువంటి పాత్ర లేనివారు ఇప్పుడు దేశ చరిత్రను తిరగరాసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అగ్నిపథ్ పథకం (Agnipath Scheme) పేరుతో రక్షణ దళాలను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందన్నారు.
1993 జూలై 21న జరిగిన యువజన కాంగ్రెస్ (Youth Congress) ర్యాలీలో పోలీసు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిని సంస్మరించుకుంటూ ఏటా జూలై 21న టీఎంసీ అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తోంది. అప్పట్లో లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉండేది, మమత బెనర్జీ యువజన కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా పని చేశారు. 1998లో తృణమూల్ కాంగ్రెస్ను స్థాపించారు. 2011లో పశ్చిమ బెంగాల్లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది.