హర్యానాలో బీజేపీ వెనుకంజ

ABN , First Publish Date - 2021-11-02T17:40:54+05:30 IST

హర్యానా అధికార పార్టీ బీజేపీకి రైతుల నిరసన

హర్యానాలో బీజేపీ వెనుకంజ

న్యూఢిల్లీ : హర్యానా అధికార పార్టీ బీజేపీకి రైతుల నిరసన సెగ తగిలినట్లుంది. ఎల్లనబాద్ శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి అభయ్ సింగ్ చౌతాలా కన్నా బీజేపీ అభ్యర్థి గోబింద్ కంద వెనుకబడి ఉన్నారు. అక్టోబరు 30న పోలింగ్ జరగగా, మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాలను నిరసిస్తూ ఐఎన్ఎల్‌డీ సెక్రటరీ జనరల్ అభయ్ సింగ్ చౌతాలా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఎల్లనబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ నియోజకవర్గం నుంచి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా తిరిగి చౌతాలా పోటీ చేశారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రధాన అభ్యర్థుల్లో కాంగ్రెస్ నేత పవన్ బేనీవాల్, జేజేపీ మద్దతుతో పోటీ చేసిన బీజేపీ నేత గోబింద్ కంద ఉన్నారు. గోబింద్ గత నెలలో బీజేపీలో చేరారు. హర్యానా లోక్‌హిత్ పార్టీ చీఫ్ గోపాల్ కంద సోదరుడే గోబింద్ కంద. 


పంజాబ్, హర్యానా రైతులు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖత్తార్ తీరుపై రైతు సంఘాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. 


Updated Date - 2021-11-02T17:40:54+05:30 IST