‘దళిత బంధు’ను శాశ్వతంగా ఆపే కుట్ర
ABN , First Publish Date - 2021-10-25T08:16:09+05:30 IST
దళిత బంధును రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలంటూ ఒత్తిడి పెరుగుతుండటంతో, ఆ పథకాన్ని శాశ్వతంగా నిలిపివేసేందుకు టీఆర్ఎస్ కుట్ర పన్నిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
- టీఆర్ఎస్ వాళ్లే కేసు వేయనున్నారు: సంజయ్
- గులాబీ పార్టీకి ఓటమి భయం: ఈటల
హైదరాబాద్/ఇల్లందకుంట/వీణవంక, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): దళిత బంధును రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలంటూ ఒత్తిడి పెరుగుతుండటంతో, ఆ పథకాన్ని శాశ్వతంగా నిలిపివేసేందుకు టీఆర్ఎస్ కుట్ర పన్నిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ వర్గాల నుంచి తమకు అందిన సమాచారం ప్రకారం.. హుజూరాబాద్ ఎన్నిక తర్వాత, అధికార పార్టీ నాయకులే కోర్టులో కేసు వేయబోతున్నారని, మూడేళ్ల దాకా తేలకుండా ప్రభుత్వం కాలయాపన చేయబోతోందని వెల్లడించారు. ఇచ్చిన నిధుల్లో సగం వాపస్ పోయాయని.. వచ్చిన నిధులు ఇస్తలేరని విమర్శించారు. దళితబంధు కోసం ఒకవైపు పార్టీ కేడర్ నుంచి ఒత్తిడి పెరగడం, మరోవైపు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పథకం అమలు అసాధ్యమని అధికారులు తేల్చిచెబుతుండటంతో తమకు ఇబ్బందికరంగా మారిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే వాపోతున్నారని సంజయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్కు దళితులపై చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇవ్వాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దళితులకు సీఎం పదవి, మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశారని, దళితబంధు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఓడిపోతున్నామనే భయంతో టీఆర్ఎస్ కాళ్ల కింద భూమి కదిలిపోతుందని మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. ఈటలకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు రావంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రేవంత్రెడ్డి, ఈటల రాజేందర్ కుమ్మక్కయ్యారని కేటీఆర్ అన్నారని.. మే 7న మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి కూతురు నిశ్చితార్థానికి వెళితే అక్కడ రేవంత్ ఉన్నారని తెలిపారు. శుభకార్యంలో కలిస్తే మాట్లాడుకోవడం తప్పా..? అని ప్రశ్నించారు.
ఆరోగ్య శ్రీకి ప్రభుత్వం రూ.1,300 కోట్లు బాకీ ఉందని, మంత్రి హరీశ్ రావు ఆ బకాయిలు ఇవ్వాల్సింది పోయి ఇక్కడ డబ్బులు పంచుతున్నారని విమర్శించారు. ప్రజల ఆరోగ్యం మీద, వడ్ల కొనుగోలు మీద శ్రద్ధ లేదని.. కేవలం రాజేందర్ను ఓడించడమే వారి పని అన్నారు. రూ.2వేలకోట్ల భూములమ్మి, తనను ఓడించేందుకు దళితబంధు తెచ్చారని చెప్పారు. 30న హుజూరాబాద్ నుంచే కేసీఆర్ అహంకారాన్ని అణచివేయాలనికోరారు.