కేంద్రం 2.72 లక్షల కోట్లు ఇచ్చింది

ABN , First Publish Date - 2021-09-17T09:16:44+05:30 IST

‘‘గత ఏడేళ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో రూ.2.72 లక్షల కోట్లు చెల్లించింది. కానీ రూ.1.46 లక్షల కోట్లు మాత్రమే చెల్లించి, తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి కేటీఆర్‌ ఆరోపిస్తున్నారు. గత..

కేంద్రం 2.72 లక్షల కోట్లు ఇచ్చింది

రూ.1.46 లక్షల కోట్లు ఇచ్చిందంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు

కేటీఆర్‌కు సిగ్గుంటే రాజీనామా చేయాలి: బండి సంజయ్‌


కామారెడ్డి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ‘‘గత ఏడేళ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో రూ.2.72 లక్షల కోట్లు చెల్లించింది. కానీ రూ.1.46 లక్షల కోట్లు మాత్రమే చెల్లించి, తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి కేటీఆర్‌ ఆరోపిస్తున్నారు. గత ఏడేళ్లలో ఇప్పటి వరకు రూ.2.52 లక్షల కోట్లను తెలంగాణకు కేంద్రం చెల్లించింది. ఇవి కాక దేశ రక్షణ, విమానయాన, శాటిలైట్‌ నిర్వహణ, జాతీయ విపత్తు నిర్వహణ వంటి అంశాలలో కేంద్రం భారీగా రాష్ట్రంపై ఖర్చు చేస్తోంది’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలానికి చేరిన ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తమపై దుష్ప్రచారం చేస్తూ సవాల్‌ విసిరిన మంత్రికి ఏమాత్రం సిగ్గున్నా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన నిధుల విషయంపై కేసీఆర్‌ మాట్లాడితే లెక్కలతో సహా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మహబూబ్‌నగర్‌ భూత్‌పూర్‌ మండలంలో బీజేపీ కార్యకర్తను టీఆర్‌ఎస్‌ నాయకులు హత్య చేశారని, తక్షణమే నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, లేకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాగా కామారెడ్డి జిల్లాలో సంజయ్‌ పాదయాత్ర రెండో రోజు కొనసాగింది.  

Updated Date - 2021-09-17T09:16:44+05:30 IST