Annamalai question: ఏం కలవకూడదా?

ABN , First Publish Date - 2022-08-11T13:16:46+05:30 IST

రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కలుసుకోవడంలో తప్పేముందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president

Annamalai question: ఏం కలవకూడదా?

- గవర్నర్‌, రజనీ భేటీలో తప్పేంటి ? 

- సీపీఐకి పనీపాటా లేదు

- మండిపడిన అన్నామలై  


ప్యారీస్‌(చెన్నై), ఆగస్టు 10: రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కలుసుకోవడంలో తప్పేముందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) ప్రశ్నించారు. ఆయన ప్రజాస్వామ్యబద్ధంగానే గవర్నర్‌ను కలుసుకున్నారని, కానీ దీనిని కాంగ్రెస్‌, వామపక్షాలు విమర్శించడం సరి కాదన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని ఇంటింటా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు రాష్ట్ర బీజేపీ మత్స్య విభాగం ఆధ్వర్యంలో నీలాంగరై సముద్రతీరంలో బుధవారం జాతీయ పతాకాలతో పడవలపై ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారాన్ని ప్రారంభించి సముద్రంలో కొంతదూరం పడవలో ప్రయాణం చేసిన అనంతరం అన్నామలై(Annamalai) మీడియాతో మాట్లాడారు. జాతీయ పతాకం విశిష్టతను ప్రజలకు తెలియజేయాలన్న ఉద్ధేశంతో 300లకు పైగా పడవలతో సముద్రంలో నిర్వహించిన ర్యాలీని జాలర్లు స్వాగతించారని తెలిపారు. గవర్నర్‌గా ఉన్న వ్యక్తి రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజలను కలుసుకొని వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకోవడం ఆయన బాధ్యతని, అందువల్లే రాజ్‌భవన్‌కు కుల, మత, భాషలకతీతంగా అందరూ వెళ్లి వస్తుంటారని తెలిపారు. అలాగే, తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Tamil superstar Rajinikanth) కూడా ఇటీవల గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కాసేపు రాజకీయాల గురించి ప్రస్తావించారని, దీనిని డీఎంకే ‘బి’ టీమ్‌గా ఉన్న కమ్యూనిస్ట్‌  నేతలు విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. జాలర్ల పడవలకు 80 శాతం రాయితీ పంపిణీ, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇవన్నీ రాజకీయమే అయినా సీపీఐ నేతలకు వాటి గురించి మాట్లాడే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. కమ్యూనిస్ట్‌ నేతలకు పని లేకే గవర్నర్‌-రజనీల భేటీని విమర్శిస్తున్నారని అన్నామలై మండిపడ్డారు. 

Updated Date - 2022-08-11T13:16:46+05:30 IST