ఆ మీటింగ్‌లో మీ అబ్బాయి ఎందుకు.. సీఎంను నిలదీసిన బీజేపీ

ABN , First Publish Date - 2021-10-03T21:50:15+05:30 IST

పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నిని బీజేపీ నిలదీసింది. పంజాబ్ డీజీపీ ఇక్బాల్ ప్రీత్ సింగ్ సహోటాతో

ఆ మీటింగ్‌లో మీ అబ్బాయి ఎందుకు.. సీఎంను నిలదీసిన బీజేపీ

చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నిని బీజేపీ నిలదీసింది. పంజాబ్ అఫీషియేటింగ్ డీజీపీ ఇక్బాల్ ప్రీత్ సింగ్ సహోటాతో సహా పలువురు సీనియర్ పోలీసు అధికారులతో ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్ని జరిపిన అత్యున్నత స్థాయి భద్రతా సమావేశంలో ఆయన కుమారుడు రిథమ్‌జిత్ సింగ్ పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. బుధవారంనాడు అధికారులతో సీఎం జరిపిన అత్యున్నత స్థాయి భద్రతా సమావేశానికి రిథమ్జిత్ సింగ్ హాజరైన ఫోటోలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. అధికారుల వెనుక సీటులో రిథమ్ సింగ్ కూర్చుని ఉన్నట్టు ఆ ఫోటోల్లో కనిపిస్తోంది. సమాచార, ప్రజాసంబంధాల శాఖ ఈ ఫొటోలు విడుదల చేసింది.


కాగా, బీజేపీ పంజాబ్ విభాగం చీఫ్ అశ్విని శర్మ ఈ చర్యను తప్పుపట్టారు. మాజీ కేబినెట్ మినిస్టర్‌గా ముఖ్యమంత్రి చన్నీకి నియమ నిబంధనలు తెలిసి ఉండాలని, పాలనా వ్యవహారాల విశ్వసనీయత, ఔన్నత్యాన్ని సీఎం పాటించాలని అన్నారు. సీనియర్ బ్యూరోక్రాట్లతో జరిపిన ఉత్యున్నత స్థాయి సమావేశానికి ముఖ్యమంత్రి తనయుడిని అనుమతించడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-10-03T21:50:15+05:30 IST