మోదీజీ.. మీకేమి నైతికత ఉంది?: మల్లికార్జున ఖర్గే

ABN , First Publish Date - 2021-08-04T22:53:17+05:30 IST

విపక్షాలు పార్లమెంటును అడ్డుకుంటూ అవాంతరాలు సృష్టిస్తున్నాయని ప్రధాని మోదీ చేసిన..

మోదీజీ.. మీకేమి నైతికత ఉంది?: మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ: విపక్షాలు పార్లమెంటును అడ్డుకుంటూ అవాంతరాలు సృష్టిస్తున్నాయని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో విపక్ష కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఆ మాట అనే నైతిక అధికారం ఆయనకు (ప్రధాని) ఎక్కడిదని ప్రశ్నించారు. ''అవాంతరాలే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాయి'' అంటూ బీజేపీ గతంలో చేసిన వాదనకే కట్టుబడి ఉండాలని అన్నారు. మన్మోహన్ సింగ్ సారథ్యంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 'డిస్‌రప్షన్ ప్రొటక్ట్స్ డెమోక్రసీ' అంటూ బీజేపీ సీనియర్ నేతలు వాదించడాన్ని ఖర్గే గుర్తు చేశారు.


''విపక్షాలు పార్లమెంటును అడ్డుకుంటున్నాయంటూ మాట్లాడే నైతిక అధికారం ఆయనకు ఎక్కడిది? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు రెండు పార్లమెంటు సమావేశాలు తుడిచిపెట్టుకు పోయాయి. అవాంతరాల వల్లే ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుందని ఆ (బీజేపీ) నాయకులే అప్పడు వ్యాఖ్యానించారు'' అని ఖర్గే అన్నారు.


రాహుల్ ఐక్యతాయత్నం ప్రజాస్వామ్య పరిరక్షణకే..

దేశ ప్రయోజనాలు, స్వేచ్ఛ, రాజ్యంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకే రాహుల్ గాంధీ విపక్షాల ఐక్యతకు కృషి చేస్తున్నారని ఖర్గే అన్నారు. పెగాసస్ రిపోర్ట్‌తో సహా వివిధ అంశాలపై చర్చను విపక్షాలు బలంగా కోరుకుంటున్నాయని చెప్పారు. పేద ప్రజల తరఫున, పేదల సమస్యల పరిష్కారానికి రాహుల్ కట్టుబడి ఉన్నారని, ప్రాంతీయ రాజకీయాలను పక్కనపెట్టిస దేశ ప్రజల స్వేచ్ఛ, రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజకీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి రావాలని రాహుల్ కోరుకుంటున్నారని, ఆ దిశగా  ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. 

Updated Date - 2021-08-04T22:53:17+05:30 IST