నిజం ఇదీ.. అంటూ రాహుల్ ట్వీట్కు బీజేపీ సమాధానం
ABN , First Publish Date - 2020-11-29T02:55:01+05:30 IST
నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ ఆందోళన కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ ఆందోళన కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటో విపరీతంగా వైరల్ అయింది. ఓ పోలీసు వృద్ధరైతుపై లాఠీ ఎత్తినట్టు ఉన్న ఆ ఫొటోను పోస్టు చేసిన రాహుల్.. ఇది చాలా విచారకరమని, ‘జై జవాన్ జై కిసాన్’ మన నినాదమని, కానీ ఈ రోజు మోదీ మోదీ అహంకారం వల్ల జవాను కాస్తా రైతుకు వ్యతిరేకంగా నిలబడ్డాడని, ఇది చాలా ప్రమాదకరమని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఈ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసు చర్యను తప్పుబట్టారు. బీజేపీ బిలియనీర్ ఫ్రెండ్స్కు ఢిల్లీలో రెడ్ కార్పెట్ స్వాగతం లభిస్తోందని, కానీ రైతుల ఢిల్లీ వస్తుంటే రోడ్లు తవ్వేస్తున్నారని ఆరోపించారు. చట్టాలకు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని, కానీ రైతులు ఢిల్లీకి రావడం కూడా తప్పయిపోతోందని వాపోయారు.
రాహుల్ గాంధీ ట్వీట్పై బీజేపీ స్పందించింది. రాహుల్ను దేశంలోనే అపఖ్యాతి పాలైన నాయకుడిగా అభివర్ణిస్తూ బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. రాహుల్ షేర్ చేసిన ఫొటోను ప్రచార ఆర్భాటంగా కొట్టిపడేసిన ఆయన ఆ పోలీసు రైతును కనీసం తాకను కూడా లేదంటూ వీడియోను షేర్ చేశారు.