కేంద్ర సంక్షేమ పథకాలు రాష్ట్రంలో దళితులకు అందడం లేదు
ABN , First Publish Date - 2022-08-07T05:13:41+05:30 IST
రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయాలని జాతీయ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు లాల్సింగ్ ఆర్య తెలిపారు.
జాతీయ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు లాల్సింగ్ ఆర్య
గుంటూరు(సంగడిగుంట), ఆగస్టు 6: రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయాలని జాతీయ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు లాల్సింగ్ ఆర్య తెలిపారు. స్థానిక హిందూ ఫార్మసీ కళాశాలలో బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా రాష్ట్రస్థాయి శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశాన్ని అత్యధికకాలం పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఏమీ చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు రాష్ట్రంలో దళితులకు అందడం లేదన్నారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ మాట్లాడుతూ దళితుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 36 పథకాలు నిలిపివేశారన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికారి విష్ణువర్ధన్రెడ్డి మాట్లాడుతూ రష్యా - ఉక్రెయిన్ యుద్ధ సందర్భంలో భారతీయ విద్యార్థులను మనదేశానికి రప్పించడంలో ఎనలేని కృషి చేశారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు, విల్సన్, దారా సాంబయ్య, అయ్యాజి వేమ, శివన్నారాయణ, దారా అంబేద్కర్, దర్శనపు శ్రీనివాస్, మేకల లక్ష్మణ్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.
రాయలసీమ డిక్లరేషన్కు కట్టుబడి ఉన్న బీజేపీ
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికారి విష్ణువర్ధన్రెడ్డి పలు ఆసక్తికర వాఖ్యలు చేశారు. రాయలసీమ డిక్లరేషన్కు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో ఐపీసీ లేదని వైసీపీనే ఉందని, రాష్ట్రంలో వైసీపీ నేతలు మాట్లాడింది, చెప్పిందే వేదం అనే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంపై మహిళా కమిషన్ స్పందించాలన్నారు. 151 సీట్లు వచ్చాయని సంబరపడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. దేవాలయాలను వైసీపీ పార్టీ కార్యకర్తలకు, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కేంద్రాలుగా మార్చడం సిగ్గుచేటన్నారు. కేంద్రప్రభుత్వ నిధులను రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందన్నారు.