బీజేపీ అమ్మకాల పార్టీ.. టీఆర్ఎస్ నమ్మకాల పార్టీ: హరీశ్రావు
ABN , First Publish Date - 2021-10-09T00:27:07+05:30 IST
హుజూరాబాద్ ఉప ఎన్నికలో అరాచకానికి, అభివృద్ధికి మధ్య పోటీ జరుగుతోందని మంత్రి హరీశ్రావు అన్నారు.
హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో అరాచకానికి, అభివృద్ధికి మధ్య పోటీ జరుగుతోందని మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలపై సంపూర్ణ విశ్వాసం ఉందని, అద్భుతమైన మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేదింటి బిడ్డ అని, పేద మహిళలు ఆసరా పింఛన్ డబ్బులు కూడా ఆయనకు ఎన్నికల ఖర్చుల కింద ఇస్తున్నారని తెలిపారు. హుజూరాబాద్ ముందు నుంచే టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట లాంటిదని, 2001లో రైతు నాగలి గుర్తుతో ఈ ప్రాంత ప్రజలు గెలిపించారని గుర్తుచేశారు. బీజేపీ అమ్మకాల పార్టీ అని, టీఆర్ఎస్ పార్టీ నమ్మకాల పార్టీ అని, అమ్మకాలకు, నమ్మకాలకు మధ్య పోటీ జరుగుతోందన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత ప్రాంతమని 60-70వేల మంది రైతులు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన టీఆర్ఎస్కు ఓటు వేస్తారా, ఎందుకు ఓటు వేయాలో చెప్పని బీజేపీకి వేస్తారా? అని హరీశ్రావు ప్రశ్నించారు.